ఉత్తరాదిన భూప్రకంపనలు: జనం పరుగులు
న్యూఢిల్లీ: భూప్రకంపనలతో ఉత్తర భారతం వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ సహా నోయిడా, కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఛండీగఢ్లలో ఆదివారం సాయంత్రం 5నిమిషాలపాటు భూప్రకంపనలు సంభవించాయి.
ఈ ఘటనతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల కారణంగా ఢిల్లీలో మెట్రో రైల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్, భింద్, మోరేనా, భోపాల్ లాంటి నగరాల్లోనూ స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. కాగా, పలు చోట్ల ఇళ్లు స్పల్పంగా దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగినట్లు సమాచారం లేదు.
పాక్లో భారీ భూకంపం: హిందూకుష్ పర్వతశ్రేణుల్లో భూకంప కేంద్రం
పాకిస్థాన్లోనూ భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.6గా నమోదైంది. పాక్లోని పంజాబ్, పెషావర్, ఇస్లామాబాద్ తదితర ప్రాంతాల్లో భూమి తీవ్రంగా కంపించింది.
పాకిస్థాన్తో పాటు ఉత్తర భారతాన్ని వణికించిన భూకంప కేంద్రం ఆప్ఘనిస్థాన్లోని ఆష్కాషం ప్రాంతంలో గల హిందూకుష్ పర్వతశ్రేణుల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫైజాబాద్కు 88 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 210 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు తెలిపారు. భూకంప కారణంగా సంభవించిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.