Earthquake: ఉత్తరాదిని వణికిస్తున్న భూకంపాలు.. ఢిల్లీ తర్వాత బీహార్లోనూ భూప్రకంపనలు
Earthquake: ఉత్తరాదిని భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించిన గంటల వ్యవధిలోనే బీహార్ రాష్ట్రంలో మరో భూకంపం సంభవించింది. బీహార్ లోని సివాన్ జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం కారణంగా సివాన్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సివాన్ లో ఉదయం 8.02 గంటలకు ఈ భూప్రకంపనలు రాగా.. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 4.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. సివాన్ లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.
భూకంపం వచ్చిన సమయంలో భూమి చాలా తీవ్రంగా కంపిస్తున్నట్లు అనిపించిందని సివాన్ ప్రజలు చెప్పారు. భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు తమ కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి, వారి పిల్లలను ఒడిలో లేదా భుజాలపై మోసుకుని బయటకు పరుగులు తీశారు. భూకంపం మళ్లీ వచ్చే ప్రమాదం ఉందనే భయంతో చాలా మంది ప్రజలు ఇళ్ల బయటే చాలా సేపు కనిపించింది.

దేశ రాజధానిలోనూ భూకంపం
ఢిల్లీ-ఎన్సీఆర్ లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఉదయం తెల్లవారుజామున 5.35 గంటల సమయంలో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ ప్రాంతాల్లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవిచింది. భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప కేంద్రం ఢిల్లీకి సమీపంలోని భూమిలో 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిసింది. భూకంప సమయంలో పెద్ద శబ్ధాలు వినిపించాయని.. అపార్టుమెంట్లు, స్తంభాలు ఊగిపోయాయని స్థానికులు తెలిపారు.
స్పందించిన ప్రధాని మోడీ
ఢిల్లీలో భూకంపం సంబంధించిన అనంతరం ప్రధాని మోడీ స్పందించారు. ఢిల్లీలో మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని, భద్రతా జాగ్రత్తలు పాటించాలని ప్రధాని కోరారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications