ఆ చేపలు తింటే అంతే-సైనేడ్ కన్నా 1500రెట్లు ప్రాణాంతకం-సంచలన విషయాలు వెల్లడించిన సైంటిస్టులు
పఫర్ఫిష్ చేపను తినడం ప్రాణాంతకమా... ఆ చేపలో విషపూరితమైన పదార్థాలు ఉన్నాయా... తాజా పరిశోధనలు ఇందుకు అవుననే సమాధానం చెబుతున్నాయి.గతేడాది గుజరాత్లోని వెరావల్కి చెందిన ఓ వ్యక్తి పవర్ఫిష్ చేపను తినగా... అది విషతుల్యమైనట్లు సైంటిస్టులు ధ్రువీకరించారు. భారత్లో ఇలాంటి కేసు ఇదే మొదటిది. కేరళలోని కొచ్చిలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్టీ) ఇటీవల ప్రచురించిన జర్నల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
సైనెడ్ కన్నా 1500 రెట్లు ప్రాణాంతకం
ఆ జర్నల్ ప్రకారం... వెరావల్కి చెందిన 23 ఏళ్ల ఓ వ్యక్తి గతేడాది మే నెలలో పవర్ఫిష్ వంటకాన్ని తిన్నాడు. ఆ తర్వాత 15 నిమిషాలకే అతనిలో కొన్ని దుష్ప్రభావాలు బయటపడ్డాయి. తల తిరగడం,వెర్టిగో,అఫాసియా వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు. పవర్ఫిష్ విషతుల్యమైన ఘటన భారత్లో ఇదే మొదటిది. అతను స్టెల్లాట్ పఫర్ అనే జాతికి చెందిన చేపను తిన్నట్లు గుర్తించారు. దీన్నే అరోథ్రోన్ స్టెల్లాటస్ అని కూడా పిలుస్తారు. ఇందులో టెట్రోడోటాక్సిన్ అనే విషపదార్థం ఉన్నట్లు గుర్తించారు. ఇది సైనేడ్ కన్నా 1500 రెట్లు ప్రాణాంతకమని చెబుతున్నారు.
ఇండియాలో ఆ డేటా ఉందా..?
పఫర్ఫిష్ తిని ఆస్పత్రిపాలైన అనేక అనుమానాస్పద కేసులు,అనుమానాస్పద మరణాలు సంభవించిన ఘటనలు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే సైంటిఫిక్గా ఇప్పటివరకూ ఇవి నిరూపితం కాలేదన్నారు. ఫలితంగా పవర్ఫిష్ తినడం ప్రాణాంతకం అని చెప్పేందుకు ఎటువంటి డేటా లేదన్నారు. జపాన్,ఆస్ట్రేలియా,సింగపూర్,అమెరికా దేశాల్లో మాత్రం దీనికి సంబంధించిన డేటా ఉందన్నారు. భారత్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగులోకి రాకపోవడం,అసలు ఆ చేపల్లో విషతుల్యమైన పదార్థం ఉంటుందని చాలామందికి తెలియకపోవడం వంటి కారణాలతో పఫర్ఫిష్ తినడం కారణంగా సంభవించిన మరణాలపై డేటా కొరత ఉందన్నారు.
ఆ చేపల్లోని లివర్,అండాశయాల్లో విషపదార్థాలు...
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ పరిశోధన ప్రకారం... పఫర్ఫిష్ భారత్లో చాలా చౌక ధరలో లభిస్తుంది. అయితే మత్స్యకారులు,వ్యాపారులు,చేపలు తినేవారు ఇందులో విష పదార్థాలను గుర్తించరు. భారత్లోని విస్తారమైన కోస్తా తీరంలో దాదాపు 11 రకాల పఫర్ఫిష్ చేపలు లభిస్తాయి. అయితే ఇందులో ఉండే విషపదార్థం గురించి చాలామందికి తెలియదు. వాటిని తినడం ద్వారా కొద్ది క్షణాల్లోనే మరణం సంభవించవచ్చు. ఆ చేపల్లోని లివర్,అండాశయాల్లో టెట్రోడోటాక్సిన్ విషపదార్థం ఉండటం వల్లే ఈ పరిస్థితికి దారితీస్తుంది.
ఆ రెండు అత్యంత విషతుల్యం...
ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో నాలుగు రకాల పవర్ఫిష్ చేపల్లోని అవయవాల్లో టెట్రోడోటాక్సిన్ విషపదార్థాన్ని గుర్తించారు. వర్షకాలంలో,వర్షకాలం తర్వాత భారత్లో లభించే ఈ జాతికి చెందిన 4 రకాల చేపల్లో ప్రాణాంతక విషపదార్థం ఉన్నట్లు తేల్చారు. భారత్లో లభ్యమయ్యే 11 పవర్ఫిష్ చేపల్లోని పాల మచ్చల పఫర్,చెలినోడాన్ పటోకా చేపలు అత్యంత విషతుల్యమైనవిగా గుర్తించారు. ఇందులో ఉండే టెట్రోడోటాక్సిన్కు వేడిని సైతం తట్టుకునే స్థిరత్వం ఉండటంతో... ఆ చేపలను వండినప్పటికీ ఆ విషం తొలగిపోదని సైంటిస్టులు చెప్పారు. మత్య్సకారులతో పాటు ప్రజలకు దీనిపై అవగాహన కల్పించడం ద్వారా ఈ విషతుల్యమైన చేపలను తినకుండా ఉంటారని పేర్కొన్నారు. సీఐఎఫ్టీ సైంటిస్టులు టామ్ సీ జోసెఫ్,ప్రదీప్,టీకే అనుపమ,ఇజాజ్ పర్మర్,వి రేఫుక,ఎస్ రేమ్యా,సీఎన్ రవిశంకర్,డీజీ గోస్వామి తదితరులు ఈ పరిశోధన బృందంలో ఉన్నారు.