సాక్షి మహారాజ్ కు ఈసీ షోకాజ్ నోటీసులు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కు ఎలక్షన్ కమిషన్ షోకాజ్ నోటీసులు జారీచేసింది.
న్యూఢిల్లీ: అనుకున్నంతా అయింది. ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కు ఎలక్షన్ కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జనవరి 4న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత సాక్షి మహారాజ్ నోరుజారిన విషయం తెలిసిందే.
గత శనివారం మీరట్ లోని ఓ దేవాలయ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒక వర్గానికి చెందిన వారు నలుగురిని పెళ్లి చేసుకుని, నలభై మంది పిల్లల్ని కంటూపోవడమే భారతీయ జనాభా విపరీతంగా పెరగడానికి కారణమని సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలను జేడీ-యూ నేత కె.సి.త్యాగి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.సి.మిట్టల్ తప్పుబట్టడం, ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని, తాము దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొనడం తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంపై రేపటిలోగా వివరణ ఇవాలని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కు పంపిన షోకాజ్ నోటీసుల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.