పోలింగ్కు ముందు ఢిల్లీ సీఎంకు షాక్.. వీడియోలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఈసీ నోటీసులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభంకానుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు పంపడం సంచలనం రేపుతోంది. కేజ్రీవాల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉందని, అందులోని విషయం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని, దీనిపై శనివారం సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అదే చివరి వీడియో..
దాదాపు 50 రోజులపాటు సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఓటర్లకు తన చివరి సందేశంగా మీడియాతో మాట్లాడిన ఓ వీడియోను సీఎం కేజ్రీవాల్ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అందులో ఆయన షాహీన్ బాగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికల్లో తలపడే అంశాలేవీ లేక బీజేపీ షాహీన్ బాగ్ పై రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఈసీ నోటీసులు జారీ అయ్యేనాటికి అదే చివరివీడియో. నోటీసులకు కేజ్రీవాల్ సమాధానం చెబుతారని ఆప్ వర్గాలు తెలిపాయి.

భారీ ఏర్పాట్లు..
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. ఉదయం 4 గంటల నుంచే మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. ఢిల్లీలో అర్హులైన ఓటర్లు 1.46 కోట్ల మందికాగా, వారికోసం రాష్ట్రవ్యాప్తంగా 13,750 పోలింగ్ బూత్ లను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. దాదాపు లక్షమంది పోలింగ్ సిబ్బంది ఇప్పటికే ఆయా ప్రాంతాలకే చేరుకున్నారు.

గెలుపెవరిది?
ఎన్నికల్లో సెక్యూరిటీ కోసం పెద్ద ఎత్తున బలగాను మోహరింపజేశారు. 190 కంపెనీల పారామిలటరీ బలగాలు, 3800 మంది ఢిల్లీ పోలీసులు, 19వేల మంది హోం గార్డులు వివిధ ప్రాంతాల్లో డ్యూటీలు నిర్వహిస్తున్నారు. అధికార ఆమ్ ఆద్మ పార్టీ(ఆప్)తో బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ వైరలైంది. బీజేపీకి 45కు పైగా సీట్లు వస్తాయని షా ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications