దీదీకి ఈసీ షాక్: నందిగ్రామ్ రీకౌంటింగ్ లేదు -రాత్రికి మమత రాజీనామా, కొత్త సీఎంకు గవర్నర్ సిఫార్సు?
ఒంటికాలితో వీల్ చైర్పై తిరుగుతూ, ఉద్దండ పిండాలైన మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయంసాధించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇంకా చిక్కులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకుగానూ 213సీట్లను గెల్చుకుని వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైనా, సొంత సీటు నందిగ్రామ్ లో ఓటమి దీదీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. బీజేపీకి సహకరించినట్లుగా ఎవరినైతే మమత నిందించారో ఆ ఎన్నికల కమిషనే మరోసారి ఆమెకు షాకిచ్చింది. మరోవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా సోమవారమే రాజీనామా చేయనున్న మమతకు మరోసారి ఆ పదవి చేపట్టే అవకాశం దక్కుతుందా, లేదా అనేదీ ఉత్కంఠగా మారింది.
బీజేపీ గెలుపుతో జగన్ చేతికి అస్త్రం -అడకత్తెరలో కేంద్రం -ఏపీలో మళ్లీ హోదా ఉద్యమం? వైసీపీ గేమ్!
నందిగ్రామ్ రీకౌంటింగ్కు ఈసీ నో
బెంగాల్ అంతటా విజయదుందుభి మోగించిన మమత తాను స్వయంగా పోటీచేసిన నందిగ్రామ్ స్థానంలో మాత్రం ఓడిపోవడం తెలిసిందే. ఆదివారం నాటి ఎన్నికల ఫలితాల్లో నందిగ్రామ్ నియోజకవర్గం కౌంటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. రౌండ్ రౌండ్ కూ ఆధిక్యం మారుతూ హోరాహోరీగా సాగిన కౌంటింగ్ లో తొలుత మమత గెలుపొందినట్లు వార్తలు వచ్చాయి. కాసేపటికే బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి విజయం సాధించినట్లు ఈసీ ప్రకటించింది. రాత్రి 10:30 తర్వాతగానీ మమతపై సువేందు 1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించాడని ఈసీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. కాగా, సదరు ఫలితంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ టీఎంసీ తిరిగి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. నందిగ్రామ్ లో రీకౌంటింగ్ జరపాలని దీదీ సేన పట్టుపట్టింది. కానీ అందుకు ఈసీ నో చెప్పింది..
మోదీ చేతిలో దీదీ జుట్టు -సీఎం పదవికి 'గవర్నర్' గండం -రాత్రి 7కు భేటీ -నందిగ్రామ్ ఓటమితో చిక్కులు
ఏదో కుట్ర జరిగింది..
''రాష్ట్రంలో మూడింట రెండొంతుల సీట్లను టీఎంసీ గెలుచుకుంది. అలాంటిది నందిగ్రామ్ లో సీఎం మమత ఓడిపోవడమేంటి? కచ్చితంగా ఇందులో ఏదో కుట్ర దాగుంది. ఫలితాన్ని తారుమారుచేసే మాల్ ప్రాక్టీస్ జరిగింది. అందుకే పూర్తి స్థాయి రీకౌంటింగ్ జరపాలని మేం ఈసీని డిమాండ్ చేస్తున్నాం'' అని టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ అన్నారు. అయితే, ఈసీ మాత్రం అందుకు నో చెబుతూ.. ''ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లు(ఈవీఎం)లో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను పోల్చిచూసి లెక్కించిన తర్వాతే తుది ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాం. రీకౌంటింగ్ జరపాల్సిన అవసరమే లేదు'' అని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. కాగా, రీకౌంటింగ్ విషయంలో ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తామని సీఎం మమత, టీఎంసీ నేతలు తెలిపారు.
మమత రాజీనామా.. తర్వాతి సీఎం ఎవరు?
నందిగ్రామ్ స్థానంలో రీకౌంటింగ్ వివాదం ఇప్పట్లో తేలేలా లేకున్నా బెంగాల్ లో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా మమతా బెనర్జీ వడివడిగా కదులుతున్నారు. సోమవారం రాత్రి 7గంటలకు ఆమె రాజ్ భవన్ వెళ్లి, సీఎం పదవికి రాజీనామా సమర్పించనున్నారు. ఈ మేరకు గవర్నర్ జగదీప్ ధనకర్ అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. ఎమ్మెల్యేగా గెలవనేని మమత.. రాజీనామా తర్వాత కేవలం టీఎంసీ అధినేత్రిగా మాత్రమే మిగలనుండగా, ఆమెతో గవర్నర్ తిరిగి ప్రమాణం చేయిస్తారా? లేక కొత్త సీఎం పేరును సిఫార్సు చేయాలని కోరతారా? అనేది ఉత్కంఠగా మారింది. బెంగాల్ లో శాసన మండలి వ్యవస్థ లేనందున మమతకు శాసన సభ ఒక్కటే దారి. ఇప్పుడు గెలిచిన 213మందిలో ఒకరు దీదీ కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేస్తే, ఆరు నెలల్లోపు తిరిగి గెలవడం ద్వారా మాత్రమే ఆమె సీఎం పదవిలో కొనసాగే వీలుంటుంది. సొంత విచక్షణతో కాకుండా కేంద్రం చెప్పింది తూచా తప్పకుండా ఆచరించే వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగాల్ గవర్నర్ మమత ప్రమాణానికి అడ్డుపడతారా, లేక సాఫీగా వ్యవహారాన్ని సాగనిస్తారా అనేది ఇంకొద్ది గంటల్లో తేలనుంది.