మోడీపై హేట్ స్పీచ్: రాహుల్ గాంధీకి ఈసి నోటీసు
న్యూఢిల్లీ: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈసి నోటీసు జారీ చేసింది. బిజెపి అధికారంలోకి వస్తే 22 వేల మంది చచ్చిపోతారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ ర్యాలీలో మే 1వ తేదీన రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్య చేశారు.
రాహుల్ గాంధీ విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నట్లు ఈసి తెలిపింది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెలిపింది. బిజెపి వస్తే హింస పెరుగుతుందని, 22 వేల మంది మరణిస్తారని, వారు ఆగ్రహాన్ని పెంచుతారని, ఈ సమస్య ఇంతకు ముందు రాలేదని రాహుల్ గాంధీ అన్నారు.
మే 12వ తేదీలోగా తమ నోటీసుకు జవాబు ఇవ్వాలని ఈసి రాహుల్ గాంధీని ఆదేశించింది. లోకసభ ఎన్నికల పోలింగ్ అదే రోజు ముగుస్తోంది. రాహుల్ వ్యాఖ్యలపై బిజెపి ఈసికి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ ప్రసంగం సీడిని, వార్తాపత్రికల క్లిప్పింగులను ఈసికి సమర్పించింది.
పరస్పర విద్వేషాలను పెంచే వ్యాఖ్యలు చేయకూడదని ఈసి నిబంధన. అలాంటిది చేస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లే.