పంజాబ్ ఎన్నికల వాయిదా - ఎలక్షన్ కమీషన్ నిర్ణయం : అసలు కారణం ఇదే..!!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని వివిధ రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ నిర్వహించింది. గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీ మార్చాలని కాంగ్రెస్, భాజపా, అకాలీదళ్ తదితర పార్టీలు కోరినందున.. దీనిపై చర్చించింది. అనంతరం ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంది. పంజాబ్ శాసనసభ ఎన్నికలను వారం పాటు వాయిదా వేసింది. ఫిబ్రవరి 14కు బదులుగా... ఫిబ్రవరి 20న నిర్వహించాలని నిర్ణయించింది. వేర్వేరు రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
పోలింగ్ డేట్ మార్పు
ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి కావటంతో సీఎం చన్నీతో సహా..పలు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసాయి. ఈ పర్విదినాన లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్ప్రదేశ్ వారణాసికి వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ జనవరి 13న ఈసీకి లేఖ రాశారు. బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
32 శాతం ఓటింగ్ కు దూరమయ్యే ఛాన్స్
రాష్ట్రంలో ఆ వర్గానికి చెందినవారు దాదాపు 32శాతంగా ఉన్నారు. భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. గురు రవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరాయి. దీంతో..వారం పాటు ఎన్నికల పోలింగ్ తేదీని వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించాలని జనవరి 17న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఎన్నికల సంఘం వాయిదా ప్రకటన
అయితే, ఇప్పుడు గురు రవిదాస్ జన్మదినం సందర్భంగా వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఫిబ్రవరి 14న పంజాబ్.. గోవా..ఉత్తరాఖండ్ మూడు రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ పూర్తయ్యేలా గతంలోనే ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. దీంతో..పంజాబ్ లో మాత్రం అక్కడి రాజకీయ పార్టీల వినతులను పరిగణలోకి తీసుకొని వాయిదా నిర్ణయం ప్రకటించింది. అయితే, ప్రస్తుతం పంజాబ్ లో అన్ని పార్టీలు తమ అభ్యర్ధుల ప్రకటన పైన ఫోకస్ పెట్టాయి. పోలింగ్ తేదీ మినహా.. నామినేషన్లు.. స్క్రూటినీ ఇతర తేదీల్లో మార్పు ఉండే అవకాశం లేదని స్పష్టం చేసారు.