Economic Survey: అంతర్జాతీయ అంశాల ప్రభావం వల్లే ఆర్థిక మందగమనం: సీఈఏ
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ శనివారం లోక్సభ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక సర్వే విడుదల చేశారు. ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోందో ఈ సర్వేలో వెల్లడించడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
Recommended Video
ఈ నేపథ్యంలో కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఆర్థిక సర్వేపై మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక మందగమనంలో ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల ప్రభావం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా మందగమనానికి గురైందన్నారు.
సంపద సృష్టించడమనేది తాము ఈ ఆర్థిక సంవత్సరం తీసుకున్న థీమ్ అని చెప్పారు. కొత్తగా విడుదల చేసిన 100 రూపాయల నోట్లపై కూడా ఈ థీమ్ వివరించే విధంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. రాబోయే కాలంలో ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా మెరుగైన ఫలితాలను సాధిస్తుందని చెప్పారు.
ఎంటర్ప్రిన్యూర్లకు ప్రోత్సాహం కల్పించి సంపదను సృష్టించేందుకు కృషి చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశమని అన్నారు. సంపదను అన్ని వర్గాల నుంచి సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సంపద సృష్టిలో ఉద్యోగాలది కూడా కీలక పాత్ర అని చెప్పారు.
మన దేశంలో ఉద్యోగ, ఉఫాధి అవకాశాలను మెరుగుపర్చడానికి చైనా అనుసరిస్తోన్న విధానాలను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పారు. ఆర్థిక ప్రగతి పరుగులెత్తాలంటే సేవా రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సేవారంగం బలోపేతం కావాలంటే ఉద్యోగాల కల్పన ఒక్కటే మార్గమని చెప్పారు.
ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో చైనా వైవిధ్యభరితమైన విధానాలను అనుసరిస్తోందని కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా ఆవిర్భవించినప్పటికీ.. నిరుద్యోగుల సంఖ్య అక్కడ చాలా పరిమితంగా ఉందని అన్నారు. దీనికోసం కొన్ని అరుదైన విధానాలను చైనా రూపొందించుకుందని, దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. అదే ఫార్ములాను భారత్లో అమలు చేయడం ద్వారా నాలుగు కోట్ల ఉద్యోగాలను కల్పించవచ్చని అన్నారు. ఉద్యోగాల కల్పన ద్వారా సంపద సృష్టి జరుగుతోందని ఆయన వివరించారు.