వివో భారీ అక్రమాలు: పన్ను ఎగవేసేందుకు రూ. 62వేల కోట్లను చైనాకు తరలింపు
న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ సంస్థ వివో భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వివో మొబైల్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, దాని 23 అనుబంధ కంపెనీలపై జులై 5న దాడులు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక విషయాలను గుర్తించింది. భారత్లో పన్ను ఎగవేసేందుకు వివో తమ టర్నోవర్లో సుమారు 50శాతం మొత్తాన్ని చైనాకు తరలించినట్లు ఈడీ తెలిపింది. ఈ మొత్తం 62వేల 476కోట్లు అని వెల్లడించింది.
Recommended Video

119 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 465 కోట్ల రూపాయల వివో నిధులను స్తంభింపజేసినట్లు ఈడీ వివరించింది. మరో 73 లక్షల నగదు, 2 కిలోల బంగారు కడ్డీలను కూడా సీజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. కాగా, వివో మాజీ డైరెక్టర్ బిన్ లౌ అనేక కంపెనీలను విలీనం చేసిన తర్వాత 2018లో భారత్ విడిచి వెళ్లినట్లు ఈడీ వెల్లడించింది. ఆ కంపెనీలన్నీ తమ దర్యాప్తు పరిధిలో ఉన్నట్లు పేర్కొంది.

కాగా, వివోకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు జెంగ్షెన్ ఔ, చాంగ్ చియా జులై 5న సోదాలు జరిగిన వెంటనే చైనా పారిపోయినట్లు ప్రచారం జరిగినా.. 2021లోనే వెళ్లిపోయినట్లు ఈడీ అధికారి ఒకరు చెప్పారు. ఇదే ఆరోపణలపై సీబీఐ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. సోదాల సందర్భంగా పలువురు చైనా దేశస్థులు సహా వివో ఉద్యోగులు తమకు సహకరించలేదని ఈడీ తెలిపింది.
దర్యాప్తు బృందాలు గుర్తించిన డిజిటల్ సామగ్రిని దాచడం, అందులోని సమాచారాన్ని తొలగించడం వంటివి చేశారని విమర్శించింది. కొందరు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది.చైనా సంస్థల ఆర్థిక అవకతవకలపై విచారణలో భాగంగానే వివోపైనా దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
ఐటీ విభాగం, కేంద్ర వాణిజ్య శాఖ కూడా వివో సంస్థ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. తమ దేశ కంపెనీలపై ఈడీ, దర్యాప్తు సంస్థల సోదాలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి చేస్తే భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే, తమ దేశంలోని చట్టాలకు అనుగుణంగానే ఇక్కడి కంపెనీలు నడుచుకోవాల్సి ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications