టార్గెట్ పక్కా: సంజయ్ రౌత్ కార్నర్: రెండోసారి ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. మొన్నటివరకు గుజరాత్లోని సూరత్, ఇప్పుడు అస్సాంలోని గువాహటి కేంద్రంగా తిరుగుబాటు కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఏక్నాథ్ షిండే వర్గం.. దేశ రాజధానిపై దృష్టి సారించింది. త్వరలోనే తిరుగుబాటు నాయకులు ఢిల్లీ వెళ్తారనే ప్రచారం సాగుతోంది. మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కొద్దిసేపటి కిందటే ఢిల్లీలో ల్యాండ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పార్టీ పెద్దలతో ఫడ్నవీస్..
ఈ సాయంత్రం ఫడ్నవీస్ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుసుకోనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమౌతారనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండోసారి సమన్లను జారీ చేశారు. జులై1వ తేదీ లోపు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు.
భూ కుంబకోణంలో..
పట్ర చాల్ భూ కుంభకోణం కేసును ఎదుర్కొంటోన్న సంజయ్ రౌత్.. ఇదివరకే ఈడీ నుంచి సమన్లను అందుకున్నారు. ఇవ్వాళ ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈడీ కార్యాలయానికి ఆయన వెళ్లలేదు. తన తరఫు న్యాయవాదిని పంపించారు. విచారణకు హాజరు కావడానికి కొంత గడువు కావాలంటూ ఆయన ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. విచారణకు హాజరు కావాల్సిన తాజా తేదీని పొందుపరుస్తూ రెండోసారి సమన్లను జారీ చేశారు. జులై 1వ తేదీలోపు రావాలని ఆదేశంచారు.
సంజయ్ను వదలని ఈడీ
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభ పరిస్థితులను నివారించడంలో సంజయ్ రౌత్.. కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఉద్ధవ్ థాకరేకు ఆయన కుడిభుజంలా వ్యవహరిస్తోన్నారు. మహారాష్ట్ర రాజకీయాల సంక్షోభ తీవ్రత పతాకస్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్ధవ్ వర్గంలో కీలక నేతగా పేరున్న సంజయ్ రౌత్కు వరుసగా రెండోరోజు .. రెండోసారి ఈడీ నుంచి సమన్లు అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అరెస్ట్ తప్పదా?
తాజా సమన్ల ప్రకారం.. జులై 1వ తేదీ లోపు సంజయ్ రౌత్ తప్పనిసరిగా ముంబైలోని ఈడీ రీజినల్ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది. రెండోసారి కూడా విచారణకు హాజరు కాలేకపోతే అరెస్ట్ వారెంట్ను జారీ చేసే అవకాశాలు లేకపోలేదు. రెండుసార్లు సమన్లను ఉల్లంఘించినందున మూడోసారి అరెస్ట్ వారంట్ను జారీ చేస్తారనే ప్రచారం ఉంది. గడువులోగా ఎప్పుడైన ఈడీ కార్యాలయానికి వెళ్లే వెసలుబాటు కల్పించినందున ఇక సంజయ్ రౌత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠభరితంగా మారింది.