రాజకీయంగా దెబ్బ కొట్టడానికే ఇదంతా!..నేనెవరికీ లంచమివ్వలేదు: దినకరన్
అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ ఆర్కేనగర్ అభ్యర్థి టీటీవి దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ ఆరోపణలు వెల్లువెత్తుతుండగానే..
చెన్నై: అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ ఆర్కేనగర్ అభ్యర్థి టీటీవి దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ ఆరోపణలు వెల్లువెత్తుతుండగానే.. మరో వివాదంలో ఆయన పీకల్లోతు ఇరుక్కుపోయారు.
అన్నాడీఎంకె పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాళికంగా నిషేధించిన నేపథ్యంలో.. గుర్తును తమకు కేటాయించడానికి దినకరన్ ప్రలోభాలకు దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వచూశారన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
అంతకుముందు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు ఆదివారం నాడు ఢిల్లీలో అదుపులోకి తీసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరోవైపు దినకరన్ మాత్రం సుఖేష్ తో తాను ఫోన్ లో మాట్లాడిన అవాస్తవమని, ఎవరికీ తాను ఎలాంటి లంచం ఇవ్వలేదని చెప్పారు.

సుఖేష్ ఎవరో తెలియదు, లంచం ఇవ్వలేదు:
కేంద్ర ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చినట్లు గనుక తనకు సమన్లు జారీ అయితే వివరణ ఇచ్చుకోవడానికి తాను సిద్దంగా ఉన్నానని దినకరన్ అన్నారు. చట్టబద్దంగా తాను దీన్ని ఎదుర్కొంటానని చెప్పిన దినకరన్.. ఒక బ్రోకర్ తాను లంచం తీసుకున్నానని ఎలా చెబుతాడని ప్రశ్నించారు. సుఖేష్ కుమార్ అనే వ్యక్తి తనకు తెలియదని, తన జీవితంలో అసలు అలాంటి పేరే వినలేదని దినకరన్ చెప్పుకొచ్చారు.

రాజకీయంగా దెబ్బతీయాలనే!:
కేవలం తమ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడం కోసమే ఇలా బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే దీని వెనకాల ఎవరున్నారనేది మాత్రం తెలియడం లేదని దినకరన్ చెప్పారు. దీని వెనుక ఏం జరుగుతుందో.. ఎలాంటి ప్లాన్ ఉందో తనకు తెలియదని, సుఖేష్ తనతో మాట్లాడాడు అని చెప్పడం అర్థం లేనిదని అన్నారు.
కాగా, పన్నీర్ సెల్వం వర్గం, చిన్నమ్మ శశికళ వర్గం రెండాకుల గుర్తును మాదంటే మాదని పేచీకి దిగడంతో.. దీనిపై ఇరువర్గాల వివరణ కోరిన కేంద్ర ఎన్నికల సంఘం తీర్పును రిజర్వ్ లో పెట్టి.. ఆ గుర్తును తాత్కాళికంగా నిషేధించిన సంగతి తెలిసిందే.

శశికళను కలిసేందుకు జైలుకు:
ఎన్నికల సంఘానికి ముడుపులు ముట్టజెప్పారన్న ఆరోపణలు తీవ్రతరం అవుతుండటంతో దినకరన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో బెంగుళూరు జైల్లో ఉన్న తన మేనత్త శశికళను కలవడానికి దినకరన్ బయలుదేరారు. శశికళతో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని ఇది సాధారణ సమావేశమేనని ఆయన తెలిపారు.

సీనియర్ల తిరుగుబాటు:
దినకరన్ తీరు పట్ల అన్నాడీఎంకె మంత్రుల్లోను తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకోవడంతో దినకరన్ కు ఇది పెద్ద దెబ్బలా పరిణమించనుంది. అయితే దినకరన్ మాత్రం పార్టీలో ఎవరు తనకు వ్యతిరేకంగా లేరని, తన నాయకత్వానికి వచ్చిన ప్రమాదమేమి లేదని అంటున్నారు. పార్టీని వీడే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు.

పదవుల నుంచి తప్పుకుంటే మంచిది:
శశికళ, దినకరన్ ల చుట్టూ వివాదాలు ముసురుకోవడంతో పార్టీలోని సీనియర్లంతా వారిద్దరిని పదవుల్లోంచి దించేయాలని చూస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకె వర్గాలు తిరిగి ఒకటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు మంగళవారం నాడు దినకరన్ ను కలిసి పార్టీకి రాజీనామా చేయాలని కోరనున్నట్లు సమాచారం.
తమ డిమాండ్లకు అనుగుణంగా శశికళ, దినకరన్ ఇద్దరు తమ పార్టీ పదవుల నుంచి తప్పుకుంటే మంచిదని, లేనిపక్షంలో తామే వారిని పక్కనపెట్టాల్సి వస్తుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదంటున్నారు.












Click it and Unblock the Notifications