ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సభలు ఉండాలా వద్దా ? నేడు ఈసీ తుది నిర్ణయం
త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మఇిపూర్, గోవాలో కరోనా కల్లోలం కలకలం రేపుతోంది. భారీ ఎత్తున నమోదవుతున్న కేసులు ఆయా రాష్ట్రాల్లో అథికార యంత్రాగానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో ఎన్నికల సంఘం తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే క్రమంలో ఆయా చోట్ల ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలపై ఈ నెల 15 వరకూ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత పరిస్దితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో ఇవాళ నిషేధంపై సమీక్ష నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది.
కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఐదు ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల్లో బహిరంగ సభలపై నిషేధాన్ని పొడిగించాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఎన్నికల సంఘం ఇవాళ సమావేశం కానుంది. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్లో మాత్రం ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, మార్చి 7 మధ్య ఉత్తరప్రదేశ్ ఏడు దశల్లో 403 ఎమ్మెల్యేలను ఎన్నుకోనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.
ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్దితులను బట్టి చూస్తే బహిరంగ ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశంలో కరోనా సెకండ్ వేవ్ కు దారి తీశాయన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధర్డ్ వేవ్ వ్యాప్తికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కారణం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈసీపైనే ఉంది.
కానీ స్ధానిక రాజకీయ పార్టీలు మాత్రం పరిమితంగానైనా బహిరంగ ప్రచారానికి అనుమతి ఇవ్వాలని ఈసీని కోరుతున్నాయి. పూర్తిగా వర్చువల్ ప్రచారాలు చేసుకుంటే ఇక జనాన్ని ఆకర్షించడం కష్టమని ఆయా పార్టీలు, అభ్యర్ధులు భావిస్తున్నారు. దీంతో ఈసీ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిపోయింది.