తొలి రోజే 11 నామినేషన్లు - రాష్ట్రపతి బరిలో కొత్త ట్రెండ్ : వ్యూహాత్మకంగా బీజేపీ..!!
రాష్ట్రపతి ఎన్నికలు ఈ సారి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. కాంగ్రెస్ - బీజేపీ - ప్రాంతీయ పార్టీల మధ్య ఈ అంశంలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రపతి ఎణ్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావటంతో.. తొలి రోజునే ఏకంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ స్థాయిలో తొలి రోజునే నామినేషన్లు దాఖలు కావటం పైన ఆసక్తి కర చర్చ మొదలైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒక్కో అభ్యర్ధి నామినేషన్ సమయంలో ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న వారిలో 50 మంది ప్రతిపాదించి... మరో 50 మంది బలపరచాలి.
అయితే, ఈ 11 మంది నామినేషన్లను ఆ విధమైన మద్దతు లేదు. దీంతో..పరిశీలన సమయంలో వీటిని తిరస్కరించే అవకాశం ఉంది. ఒక అభ్యర్ధి విషయంలో తాను ఓటరుగా నమోదు చేసుకున్న పార్లమెంటరీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో తన పేరున్నట్లు ధ్రువీకరణపత్రం జతచేయకపోవడంతో ఓ అభ్యర్థి నామినేషన్ను ప్రాథమికస్థాయిలోనే రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ తిరస్కరించారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బిహార్లోని సారణ్ నియోజకవర్గానికి చెందిన లాలూప్రసాద్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం మండలం చింతగుంట గ్రామానికి చెందిన డాక్టర్ మందాటి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి సైతం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు.

ఇక, మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశంలో అభ్యర్ధి ఎవరనే దాని పైన నిర్ణయం జరగలేదు. గాంధీ..ఫరూక్ అబ్దుల్లా పేర్లను మమతా ప్రతిపాదించారు. తొలుత పవార్ పేరు చర్చకు వచ్చినా ఆయన ఆసక్తి చూపించలేదు. ఇక, ఎన్డీఏ నుంచి ఏకాభిప్రాయం కోసం మంతనాలు ప్రారంభించారు. కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాధ్ సింగ్.. తాజాగా మమతా బెనర్జీతోనూ చర్చలు జరిపారు. కానీ, ఎన్డీఏ నుంచి అభ్యర్ధి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉంది. దీంతో.. ఈ రోజు రేపు ఎన్డీఏ నుంచి రాష్ట్రపతి అభ్యర్ధి పైన సంకేతాలు వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications