పుల్వామాలో ఎన్కౌంటర్: నలుగురు ఉగ్రవాదులు హతం..ఉగ్రవాదుల్లో ఒకరు మాజీ పోలీస్ అధికారి
పుల్వామా: రంజాన్ పర్వదినం ముగిసిన రెండు రోజులకే జమ్ముకశ్మీర్లో మళ్లీ తుపాకుల మోత ప్రారంభమైంది. పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మిలిటెంటు మృతిచెందినట్లు సమాచారం. వీరంతా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులని భద్రతాదళాలు తెలిపాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందడంతో పుల్వామా జిల్లాలోని లస్సిపోరా ప్రాంతాన్ని భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి.
కార్డన్ సెర్చ్ సందర్భంగా ఉగ్రవాదులు భద్రతాదళాలపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు తిరిగి ఎదురు కాల్పలు చేశాయి. దీంతో నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకరు పోలీస్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఉన్నాడు. పోలీసు ఆఫీసరుగా పనిచేస్తున్న వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాలపై ఆకర్షితుడై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఈ ఎన్కౌంటర్లో ఇతను కూడా మృతి చెందాడు.

ఘటనా స్థలం నుంచి నాలుగు మృతదేహాలతో పాటు రెండు ఏకే 47 తుపాకులు, ఒక అత్యాధునిక ఏకేఎం తుపాకీ, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం నుంచి కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఇక మృతి చెందిన ఇతర ఉగ్రవాదులను గుర్తుపట్టాల్సి ఉంది. మృతుల్లో ఒకరైన మాజీ పోలీసు అధికారి సర్వీస్ రైఫిల్లో పనిచేసేవాడు. అక్కడ ఉన్నట్లుండి అదృశ్యమై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. కొన్ని నెలలుగా అతను అదృశ్యమయ్యాడని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే జరిగిన కాల్పుల్లో ఆయన మృతి చెందడం విశేషం. ఇంకా ఆ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం ఉండటంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.












Click it and Unblock the Notifications