కర్ణాటక మంత్రికి షాక్: సొంత కంపెనీలోకి దుబాయ్ నుంచి హవాలా సోమ్ము, నోటీసులు!
బెంగళూరు: కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పిడుగులాంటి వార్త ఎదురైయ్యింది. కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి రోషన్ బేగ్ కంపెనీకి దుబాయ్ నుంచి హావాలా సొమ్ము వచ్చిందని ఆరోపిస్తూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
కర్ణాటక నగరాభివృద్ది శాఖ మంత్రి రోషన్ బేగ్, ఆయన కుటుంబ సభ్యులు 2007లో రుమాన్ ఎంటర్ ప్రైసస్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించారు. రోషన్ బేగ్ కుమార్తె సబీహా ఫాతిమా, ఆయన కుమారుడు రుమాన్ బేగ్ కలిసి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.
రుమాన్ సంస్థకు దుబాయ్ నుంచి భారీ మొత్తంలో నిధులు డిపాజిట్ అయ్యిందని ఈడీ అధికారులు గుర్తించారు. రోషన్ బేగ్ కుటుంబ సభ్యులు దుబాయ్ నుంచి వచ్చిన నిధులకు సరైన లెక్కలు చూపించకపోవడంతో హవాలా సోమ్ము జమ అయ్యిందని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై మంత్రి రోషన్ బేగ్, ఆయన కుమారుడు, కుమార్తెకు ఫెమా చట్టం కింద నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు అందిన వెంటనే మంత్రి రోషన్ బేగ్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య దగ్గరకు పరుగు తీసి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చర్చించారు.