చైనాను అటునుంచి నరుక్కొస్తున్న భారత్.. అమెరికాకు షాక్.. మోదీ సర్కారు కీలక ప్రకటన..
పిల్లుల పంచాయతీ కోతి తీర్చినట్లుగా.. ఏ రెండు దేశాల మధ్య వివాదం చెలరేగినా, పెద్ద మనిషి పాత్రపోషించేందుకు సిద్ధమంటూ వరుస ప్రకటనలు చేస్తుంటారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. భారత్-చైనా మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలపైనా ట్రంప్ అదే రీతిగా స్పందించారు. ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తూ భారత్ ఆయనకు చిన్నపాటి షాకిచ్చింది. బోర్డర్ టెన్షన్ పై మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది.

విదేశాంగ శాఖ ప్రకటన..
సరిహద్దు వివాదం అంశాన్ని శాంతియుత పద్ధతుల్లో, చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకుంటామని భారత్ కుండబద్దలుకొట్టింది. ఇప్పటికే ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నందున దీనిపై జోక్యం అవసరంలేదంటూ అమెరికాకు స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ బుధవారం ఈ మేరకు మీడియాకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

శాంతి మంత్రం..
సరిహద్దు వెంబడి సిక్కిం, లదాక్ ప్రాంతాల్లో గడిచిన 20 రోజులుగా చైనా బలగాలు దాష్టీకానికి పాల్పడుతున్నాయి. దర్బూక్-షోయక్-దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీఓ) మధ్య భారత్ నిర్మించిన వ్యూహాత్మక రోడ్డుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న చైనా.. తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, గాల్వాన్ లోయ, ఉత్తర సిక్కింలోని నాథులా ప్రాంతాల్లో గస్తీకాస్తోన్న భారత బలగాను అడ్డుకోవడం, బాహాబాహీకి దిగడం లాంటి దుశ్చర్యలకు పాల్పడింది. యుద్ధానికి రెడీ అవుతోన్నంత స్థాయిలో సైనికులను మోహరించడంతోపాటు సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఎయిర్ బేస్ లకు యుద్ధ విమానాలను సైతం తరలించింది. చైనా తెంపరితనాన్ని దీటుగా ఎదుర్కొంటూనే.. అటునుంచి నరుక్కొచ్చే ప్రయత్నంగా భారత్ శాంతిబాటలో పయనిస్తున్నది. చైనా యుద్ధ భాష మాట్లాడుతోంటే.. భారత్ మాత్రం శాంతి మంత్రాన్ని వల్లెవేస్తున్నది.

ఇదీ మా విధానం..
‘‘సరిహద్దులో చైనాతో వివాదం నెలకొన్నమాట వాస్తవం. అయితే సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మేం భావిస్తున్నాం. అలాగని సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగితే చేతులు ముడుచుకుని కూర్చోలేం. శాంతి పంథాలో భాగంగా చైనాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. సైనికపరంగానే కాకుండా దౌత్యమార్గాల్లోనూ మా ప్రయత్నం కొనసాగుతున్నది. గ్రౌండ్ లెవల్ లో సైనిక అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఇటు ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం, అటు బీజింగ్ లోని ఇండియన్ ఎంబసీ సైతం ఇదే అంశంపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నాయి''అని విదేశాంగ శాఖ వివరించింది.

అమెరికా జోక్యం అనవరసం..
స్వయంగా ఇండియానే చైనాతో చర్చల ప్రక్రియ కొనసాగిస్తున్నందున ఈ అంశంలో జోక్యం అవసరం లేదంటూ అమెరికా ప్రెసిడెంట్ మీడియేషన్ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. సరిహద్దుల అంశానికి సంబంధించి భారత్-చైనాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయని, కీలక ప్రోటోకాల్స్ అమలులో ఉన్నాయిని, భారత్ ఏనాడూ వాటిని మీరలేదని, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా సరిహద్దులోని భారత బలగాలు కూడా శాంతియుతంగా వ్యవహరిస్తాయేతప్ప ఏనాడూ దుందుడుకు చర్యలకు దిగలేదని శ్రీవాస్తవ తెలిపారు.

తగ్గనంటోన్న ట్రంప్..
కరోనా విలయం కంటే ముందు నుంచే చైనాను టార్గెట్ చేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. భారత సరిహద్దు అంశంలో వేలుపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అయితే, హాంకాంగ్ రూపంలో ఆయనకిప్పుడు మరో సాకు దొరికినట్లయింది. హాంకాంగ్ స్వతంత్ర ప్రతిపత్తిని ఖతం చేసే ‘జాతీయ భద్రతా చట్టం'బిల్లుకు చైనా పార్లమెంట్ గురువారం ఆమోదం తెలిపింది. దీన్ని వినాశనకారి నిర్ణయంగా అభివర్ణించిన అమెరికా.. వారంలోపే చైనాపై ఎవరూ ఊహించని రీతిలో చర్యలకు దిగుతామని హెచ్చరించింది.

మోదీ నిర్ణయం మేరకే..
చైనాతో సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగానే పరిష్కరించుకుంటామంటూ విదేశాంగ శాఖ గురువారం అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారమే ఖరారు చేశారు. చైనాతో టెన్షన్ పెరుగుతోన్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్), త్రివిధ దళాల అధిపతులు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ తో మోదీ మంగళవారం రాత్రి కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే అంతర్జాతీయ సమాజంలో చైనా ఒంటరైపోతున్న వేళ.. దానితో తగువుపెట్టుకోవడం కంటే శాంతిమార్గంలో వెళ్లడమే మంచిదని మోదీ పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇవాళ్టి ప్రకటనతో భారత్ విధానం స్పష్టమైపోయింది. దీనిపై చైనా స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications