సైన్యమంతా వచ్చినా టెర్రరిస్ట్స్ని ఆపలేదు, నన్నూ చంపేయగలరు: ఫరూక్ సంచలనం
శ్రీనగర్: భారత సైన్యం అంతా కలిసిన జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదులను ఆపలేరని, వారు తల్చుకుంటే నన్ను కూడా చంపేయగలరని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదులు తల్చుకుంటే ఏమైనా చేయగలుగుతారన్నారు. భారత సైన్యమంతా కలసినా వారిని అడ్డుకోలేరన్నారు. వారు అనుకుంటే తనతో సహా ఎవరినైనా హత్య చేయగలరన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీరును ఆ దేశానికే వదిలేయాలంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూక్ మరో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పౌర సమాజ సభ్యులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... సమస్యలను ఇరు దేశాలూ చర్చలు జరపడం ద్వారానే పరిష్కరించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాలూ యుద్ధం చేసినా పీఓకేను భారత్, ప్రస్తుత జమ్మూకాశ్మీర్ను పాకిస్థాన్ పొందలేవన్నారు.
భారత్తో షరతుల్లేని చర్చకు సిద్ధమైన షరీఫ్!
శాంతి సాధన కోసం భారత్తో ఎలాంటి ముందస్తు షరతుల్లేని చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచనప్రాయంగా తెలిపినట్లు ఆ దేశ వార్తా ఛానల్ జియో న్యూస్ తెలిపింది. కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సులో భాగంగా శుక్రవారం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్తో సమావేశమైన సందర్భంగా షరీఫ్ ఇలాంటి సంకేతమిచ్చినట్లు పేర్కొంది.