తమిళనాడులో అందరికీ రిజర్వేషన్ -పీఎంకే నేత రాందాస్ షాకింగ్ డిమాండ్
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ సుప్రీంకోర్టులో జరుగుతున్న రిజర్వేషన్ల కేసు విచారణ ప్రభావం చూపుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు విధించిన 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్న తమిళనాడులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలాంటి ప్రభావం చూపనుందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పీఎంకే నేత అన్బుమణి రాందాస్ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ రిజర్వేషన్ ఉండాల్సిందేనని షాకింగ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ, ప్రతీ కులానికీ రిజర్వేషన్ ఉండాల్సిందేనని పీఎంకే నేత రాందాస్ న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. షోలిగనల్లూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాందాస్.. తాజాగా పళనిస్వామి సర్కారు ప్రకటించిన 10.5 శాతం వన్నియార్ రిజర్వేషన్ను సమర్ధించారు. వన్నియార్ కులానికే చెందిన రాందాస్.. ఈ ప్రకటన తర్వాత రిజర్వేషన్లు ప్రకటించిన అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 234 సీట్లున్న అసెంబ్లీలో 23 సీట్లకు పీఎంకే పోటీ చేస్తోంది.
తనతో పాటు అన్ని కులాలకూ, వ్యక్తులకూ వారి వారి సామాజిక వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్ అవసరమన్నదే తన పార్టీ డిమాండ్ అని పీఎంకే నేత రాందాస్ తెలిపారు. తమిళనాడులో మొత్తం 350 సామాజిక వర్గాలు ఉన్నాయని, వారి జనాభా, వెనుకబాటుతనం ఆధారంగా ఈ రిజర్వేషన్లు ఇవ్వాలని రాందాస్ కోరారు. అసలే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 50శాతం మించిన రిజర్వేషన్లపై చర్చకు తావిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలకు రోజుకో ప్రశ్న వేస్తున్న నేపథ్యంలో రాందాస్ డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకుంది.