ప్రతి సమస్యకు పరిష్కారం, 2బెడ్రూంల ఫ్లాటే: ప్రణబ్
హైదరాబాద్/లక్నో: ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉండే ఉంటుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం అన్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని అలహాబాద్లో బుధవారం ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలువురు పాత్రికేయులతో ఈ సందర్భంగా కొద్దిసేపుముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ అనిశ్చితికి పరిష్కారం దొరుకుతుందా? అన్న ప్రశ్నకు ప్రణబ్ పైవిధంగా వ్యాఖ్యానించారు.
భారత రాజకీయాల్లో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా రాజకీయ పార్టీలు తమ విధానాలను మార్చుకోవటం వల్ల, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపూర్ణమవుతోందని వ్యాఖ్యానించారు.
1989 నుంచి 2000 సంవత్సరం వరకు పార్లమెంటుకు మూడుసార్లు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఐదుసార్లు జరిగాయని, పదేపదే ఎన్నికలు రావడం దేశంలో చర్చనీయాంశంగా మారిందన్నారు. మన దేశానికి, ప్రస్తుతమున్న పార్లమెంటరీ విధానం పనికి రాదని, జపాన్ విధానం కావాలని కొంతమంది వాదించారని కానీ, 1999 తర్వాత మళ్లీ అటువంటి పరిస్థితి రాలేదన్నారు.
పార్టీలు కూడా పరిస్థితులకు అనుగుణంగా మారాయని చెప్పారు. ప్రభుత్వాలను పడగొట్టి ఎన్నికలు తెచ్చే బదులు ప్రజలను చైతన్యవంతం చేసి అధికారంలోకి రావటం వల్ల ఉపయోగం ఉంటుందని గుర్తించాయని దీంతో, ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు రావడం లేదన్నారు.
1984 తర్వాత దేశంలో ఏ పార్టీకీ సొంతంగా మెజార్టీ రాలేదని అయినా కలిసి పని చేయటాన్ని పార్టీలు నేర్చుకున్నాయని చెప్పారు. రాజకీయాల్లో నిరాడంబరత్వం ఇంతకు ముందు నుంచీ ఉందని, అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య రెండు బెడ్రూంల ఫ్లాట్లోనే నివసించే వారని ఆయన గుర్తు చేశారు. బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో మంత్రులకు బంగళాలు లేవని ఫ్లాట్లోనే ఉంటారని చెప్పారు.