మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సెకెండ్ ఇన్నింగ్ ఆరంభం: బీజేపీ ఎంపీ టికెట్ ఖాయమైనట్టే!
Recommended Video

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ గౌతమ్ గంభీర్ తన రెండో ఇన్నింగ్ ను ఆరంభించారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కండువాను కప్పుకొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ ల సమక్షంలో గంభీర్ ఆ పార్టీలో చేరారు. పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు.
గంభీర్ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా.. ఆయన బీజేపీలో చేరారు. న్యూఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో ఏదైనా ఓ నియోజకవర్గం నుంచి గంభీర్ లోక్ సభకు పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో గంభీర్ నివసిస్తున్నారు. ఆ ప్రాంతం.. న్యూఢిల్లీ లోక్ సభ పరిధిలోకి వస్తుంది. ఆయనకు అదే సీటును కేటాయించ వచ్చని సమాచారం. ప్రస్తుతం న్యూఢిల్లీ స్థానం బీజేపీ ఆధీనంలోనే ఉంది. మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ సారి ఆమెకు బదులుగా గంభీర్ కు టికెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ.. న్యూఢిల్లీ పరిధిలోని ఏడు లోక్ సభ స్థానాలకు ఏడుకు ఏడూ గెలిచింది. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది బీజేపీ. దీనితో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది.

క్రికెట్ లో ఎడం చేతి వాటం ఓపెనర్ గంభీర్ తనదైన శైలిలో రాణించారు. 2007లో టీ20, 2011 ప్రపంచకప్ లను భారత క్రికెట్ జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2003 ఏప్రిల్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టోర్నమెంట్ సందర్భంగా వన్డే క్రికెట్ లో అడుగు పెట్టాడు. 147 వన్డేలను ఆడాడు. 58 టెస్ట్ మ్యాచ్ లను ఆడిన గంభీర్ 22 అర్ధ సెంచరీలు, తొమ్మిది సెంచరీలను తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ లో కోల్ కత నైట్ రైడర్స్ జట్టుకు నాయకత్వం వహించాడు.












Click it and Unblock the Notifications