Jan Ki Baat Gujarat exit polls: కర్చీఫ్ వేసుక్కూర్చున్నట్టే..!!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఉదయం 8 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగింది. 1వ తేదీన ముగిసిన తొలి విడత తరహాలోనే ఇవ్వాళ కూడా గుజరాత్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీని ప్రభావం ఏ పార్టీ మీద ఉంటుందనేది 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో తేలిపోతుంది. గుజరాత్తో పాటు ఇప్పటికే పోలింగ్ను ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ఓట్లను లెక్కిస్తారు.
గుజరాత్లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 182. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది. తొలి విడతలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ ఇదివరకే ముగిసింది. దక్షిణ గుజరాత్, కఛ్, సౌరాష్ట్ర రీజియన్లలోని జిల్లాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన 93 స్థానాలకు ఇవ్వాళ పోలింగ్ ముగిసింది. సెంట్రల్, నార్త్ గుజరాత్లల్లో గల 14 జిల్లాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ ముగిసిన వెంటనే ఇక ఎగ్జిట్ ఫలితాలు వెల్లడి కావడం మొదలయ్యాయి. జాతీయ స్థాయిలో అన్ని మీడియా ఛానల్స్ ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడిస్తోన్నాయి. అన్ని ఫలితాలు కూడా భారతీయ జనత పార్టీకి అనుకూలంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్లో గానీ, గుజరాత్లో గానీ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేస్తోన్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి నిరాశ తప్పదని స్పష్టం చెబుతోన్నాయి.
జన్ కీ బాత్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం- గుజరాత్లో బీజేపీ మరోసారి పాగా వేయడానికి సిద్ధమౌతోంది. ఇప్పుడున్న సీట్ల కంటే కూడా భారీ మెజారిటీని సాధించుకోబోతోంది. 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 117 నుంచి 140 స్థానాలు లభిస్తాయని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది. కాంగ్రెస్ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని, ఆ పార్టీకి 34 నుంచి 51 స్థానాలు లభించవచ్చని తెలిపింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 6 నుంచి 13, ఇతరులు ఒకటి లేదా రెండు స్థానాల్లోనే విజయం సాధిస్తాయని తెలిపింది.