ఎగ్జిట్పోల్స్: అప్పట్లాగేనన్న కాంగ్రెస్, టైంపాసన్న ఒమర్
న్యూఢిల్లీ/శ్రీనగర్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్ను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. దేశంలో 80 కోట్ల మంది ఓటర్లు ఉండగా కేవలం లక్ష మంది అభిప్రాయాలతో ఇచ్చే ఫలితాలు నిజం కావని, మే 16న వెలువడే నిజమైన ఫలితాల కోసం ఎదురుచూస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మరో నేత షకీల్ అహ్మద్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తిరస్కరించారు. 2004, 2009 ఎన్నికలప్పుడు కూడా ఇలాగే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయని చెప్పారు. అవి ఎన్నికల ఫలితాల్లో తప్పని తేలిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఓ గొప్ప టైంపాస్: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: ఎన్నికల ఫలితాలపై వివిధ ఛానళ్లు ప్రసారం చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ను జమ్మాకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఓ గొప్ప టైంపాస్ వ్యవహరంగా అభివర్ణించారు. మే 16న వెలువడే ఫలితాలే నిజమైనవని, అప్పటి వరకు ఎవరెన్ని చెప్పినా జరిగేవి కావని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందంటూ ఓ ఛానెల్ వెలువరించిన ఫలితాలపై ఆయన పై విధంగా స్పందించారు. ఓ ఛానల్లో రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లే వస్తాయని ప్రకటిస్తుంటే.. మరో ఛానల్ ఆ పార్టీకి 14 సీట్లు వస్తాయని చెబుతోందని ఆయన అన్నారు. అసలు వీటికి విశ్వసనీయ ఉన్నాయా? అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.