మోడీ ఎంత డబ్బిచ్చారు? మాటల గారడీ: సుష్మాపై సోనియా
న్యూఢిల్లీ: లోక్సభ నుంచి 25 మంది పీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వరుసగా నాలుగోరోజు కూడా కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు ఆనంద్శర్మ, గులాంనబీ ఆజాద్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
ఐపిఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ అంశంపై గురువారం లోక్సభలో కేంద్రమంత్రి సుష్మారాజ్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు. సుష్మా స్వరాజ్ మాటల గారడీలో ఎక్స్పర్ట్ అని ఆరోపించారు. లలిత్ మోడీ నుంచి సుష్మా కుటుంబం డబ్బులు తీసుకుందని సోనియా ఆరోపించారు. జైలు బయట ఉండేందుకు లలిత్ మోడీ ఎంత డబ్బిచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం లోకసభలో సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ... తాను కేవలం క్యాన్సర్తో బాధపడుతున్న లలిత్ మోడీ భార్యకు మాత్రమే సహాయం చేశానని, నా స్థానంలో సోనియాగాంధీ ఉంటే ఏం చేసేవారని ప్రశ్నించారు.
సుష్మా స్వరాజ్ ప్రశ్నకు సోనియాగాంధీ స్పందించారు. ఆ స్థానంలో తాను ఉంటే క్యాన్సర్తో బాధపడుతున్న మహిళకు తన వంతు సహాయం చేస్తానే తప్ప... చట్టాన్ని ఉల్లంఘించేదాన్ని కాదని స్పష్టం చేశారు. సుష్మా నాటకీయత ప్రదర్శించారని సోనియా ఎద్దేవా చేశారు. కాగా, సోనియా.. సుష్మాలా చేయరని రాహుల్ గాంధీ అన్నారు. ఎవరికీ తెలియకుండా లలిత్ మోడీకి సహకరించారని ఆరోపించారు.
సస్పెన్షన్ ఎత్తివేతకు మేం సిద్ధం: వెంకయ్య
సభ సజావుగా సాగేందుకు సస్పెండైన సభ్యులు స్పీకర్కు హామీ ఇవ్వాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖా మంత్రి వెంకయ్యనాయడు అన్నారు. లోక్సభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ... కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ను ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సస్పెండైన సభ్యులు స్పీకర్ను కలిసి సభలోకి రావొచ్చని సూచించారు.