fact check: ఐస్ క్రీమ్, చల్లని పదార్థాలతో కరోనా వస్తుందా?
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న కరోనావైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగానే వ్యవహరిస్తూనే ఉన్నారు. అయితే, కరోనా వ్యాప్తిపై కొన్ని అపోహలు, తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంతో జనం మరింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఏది నిజం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఏంది.
Recommended Video
అలాంటిదేం లేదు..
ఐస్ క్రీమ్ తోపాటు ఇతర చల్లని పదార్థాలు తినడం వల్ల కరోనావైరస్ సోకుతందనే ప్రచారం కూడా ఈ అపోహల్లో ఒకటి. దీనిపై ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) స్పష్టతనిచ్చింది. ఐస్ క్రీమ్ తోపాటు ఇతర చల్లని పదార్థాలు తినడం లేదా తాగడం వల్ల కరోనా సోకుతుందనేందుకు ఏ ఆధారమూ లేదని తేల్చి చెప్పింది.
పుకార్లు నమ్మొద్దు..
కరోనావైరస్ వ్యాధి గురించి ప్రచారంలో ఉన్న అనేక అసత్యాల్లో ఇది కూడా ఒకటని సంస్థ పేర్కొంది. ప్రమాదకరమైన కరోనా వ్యాధికి సంబంధించిన పుకార్లలోని నిజానిజాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్ సైట్ ద్వారా నిర్ధారించుకోవచ్చని పీఐబీ తెలిపింది. వెల్లుల్లిని ఆహారంలో తీసుకున్నా సూప్లో మిరియాల పొడిని కలుపుకుంటే కరోనా తగ్గుతుందనే భావనలో కూడా నిజం లేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే ఆ రెండు పదార్థాలు శరీరానికి మంచివని పేర్కొంది.
వాస్తవం లేని ప్రచారాలు..
అంతేగాక, కరోనావైరస్ కు ఇప్పటి వరకు ఖచ్చితమైన మందు లేదని స్పష్టం చేసింది. క్రిమి సంహారక ద్రవాన్ని శరీరంపై జల్లుకోవడం, వేడి నీటితో స్నానం చేయడం, శరీర ఉష్ణోగ్రతను ఎక్కువ చేసుకోవడం, ఎండలో నిల్చుకోవడం వంటి వాటి వల్ల కరోనా నశిస్తుందనే వాదనల్లో నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈగలు, దోమల వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతుందనే వాదనలో కూడా వాస్తవం లేదని స్పష్టం చేసింది.
5జీ మొబైల్ నెట్వర్క్ తో కూడానా?
అంతేగాక, 5జీ మొబైల్ నెట్ వర్క్ కరోనాను వ్యాప్తి చేస్తుందనడంలో కూడా నిజం లేదని తెలిపింది. నిమోనియాకు సంబంధించిన వ్యాక్సిన్లు కరోనాకు పనిచేయవని తెలిపింది. మద్యం సేవించడం కరోనా నుంచి కాపాడుతుంనడంలో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. కరోనాకు మందు లేదనే.. నివారణ చర్యలు, ముందు జాగ్రత్తలే కాపాడతాయని తెలిపింది.