జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో వేసిన రూ.500లను వెనక్కి తీసుకుంటోందా? కేంద్రం ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ఒకటి కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లేనిపోని అపోహలను కలిగిస్తోందా సమాచారం. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద జీరో బ్యాలెన్స్గా పరిగణించే జన్ధన్ ఖాతాల్లో వేసిన 500 రూపాయల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందనేది దాని సారాంశం. ఇది కాస్తా వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై హల్చల్ చేసింది.
ఈ సమాచారం తెలిసిన వెంటనే పలువురు లబ్దిదారులు.. ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఏటీఎంలు మూతపడిన ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద క్యూలో నిల్చుంటున్నారు. తమ జన్ధన్ ఖాతాల్లో వేసిన 500 రూపాయల మొత్తాన్ని కేంద్రం ప్రభుత్వం వెనక్కి తీసుకోకముందే.. దాన్ని డ్రా చేయాలనేది వారి ఉద్దేశం. ఈ సమాచారం పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలను నమ్మొద్దని పేర్కొంది.
ఎక్కువ రోజులు ఆ మొత్తాన్ని ఖాతాల్లో నిల్వ ఉంచితే, వెనక్కి తీసుకుంటామంటూ వస్తోన్న వార్తలు నిరాధారమైనవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అలాంటి వార్తలను నమ్మొద్దని తెలిపారు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోన్న సమాచారానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని, వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. ఎన్ని రోజులు అకౌంట్లో నిల్వ ఉంచినా ఆ మొత్తం వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు.
ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాందోళనలను కలిగించడానికే దీన్ని పుట్టించారని అన్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించడం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు చేతనైనంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద దీన్ని జన్ధన్ ఖాతాల లబ్దిదారులకు బదలాయించామని, దాన్ని ఎలా వెనక్కి తీసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను విశ్వసించవద్దని అధికారులు ప్రజలకు విజ్ఙప్తి చేశారు.