కర్నూలు పాస్పోర్ట్: సలేంకు ఏడేళ్ల శిక్ష, ఆరేళ్లుగా జైల్లో..
హైదరాబాద్: నకిలీ పాస్పోర్టు కేసులో అబూసలేంకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) న్యాయస్థానం గురువారం ఏడేళ్ల శిక్షను ఖరారు చేసింది. ఈ కేసుకు సంబంధించి అతను ఇప్పటికే ఆరేళ్లు జైలులో ఉన్నారు. దీంతో మరో ఏడాది శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అతనిని థానే జైలుకు తరలించనున్నారు.
కాగా, నకిలీ పాస్పోర్టు కేసులో నేరం రుజువు కావడంతో మాఫియా డాన్ అబూ సలేంను పది రోజుల క్రితం కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఆ రోజు కోర్టులో హాజరుకానందున సలేంకు ఈ రోజు సిబిఐ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు చిరునామాతో అబూ సలేం తప్పుడు పాస్ పోర్టు పొందాడు. 2001లో ఈ నేరానికి పాల్పడినందుకు అబూ సలేంతోపాటు బాలీవుడ్ నటి మౌనికా బేడీని సెప్టెంబర్ 2002లో పోర్చుగల్లోని లిస్బన్లోని ఓ షాపింగ్ మాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత ఇద్దరు నిందితులను నవంబర్ 11, 2005లో భారతదేశానికి తీసుకు వచ్చారు. 2007లో మౌనికా బేడీని భోపాల్ కోర్టు నిర్ధోషిగా ప్రకటించడంతో మౌనికా బేడి జైలు నుంచి విడుదలయ్యారు. మౌనికా బేడి డిసెంబర్ 4, 2006 నుంచి జులై 16, 2007 వరకు జైలు శిక్ష అనుభవించారు.
2009 నుంచి అబూ సలేం నకిలీ పాస్ పోర్టుపై హైదారబాద్ సిబిఐ విచారణ జరుపుతోంది. అబూ సలేం పాస్ పోర్టు దరఖాస్తులో తన పేరును రామిల్ కమిల్ మాలిక్గా పేర్కొన్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. 1993లో మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో ప్రధాన నిందితుడైన అబూ సలేం జైలులో ఉన్న సమయంలో అతనిపై రెండుసార్లు దాడులు జరిగాయి. ఓ హత్య కేసులో నిందితుడైన దేవేంద్ర జగ్తప్ జైలులో ఉన్న అబూ సలేంపై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. 2005లో అబూ సలేంను భారత్ తీసుకొచ్చిన అనంతరం 2010లో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించిన సమయంలో తొలిసారి అతనిపై దాడి జరిగింది.