పార్లమెంటుకు రైతుల ట్రాక్టర్ల ర్యాలీ రద్దు-వ్యవసాయ బిల్లుల రద్దుతో-త్వరలో భవిష్యత్ కార్యాచరణ
కేంద్రం గతంలో తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని ఈసారి పార్లంమెటు శీతాకాల సమావేశాల్లో వెనక్కి తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. రైతుల నిరసనల నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం పడకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు కూడా వెనక్కి తగ్గారు. పార్లమెంటుకు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని ప్రస్తుతానికి రద్దు చేసుకున్నారు.
నవంబర్ 29న పార్లమెంట్కు నిర్వహించనున్న ట్రాక్టర్ మార్చ్ను రద్దు చేసుకన్నామని, వచ్చే నెలలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు మార్చ్ను నిలిపివేయాలనే నిర్ణయాన్ని రైతులు తీసుకున్నారు. ఏడాది కాలంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాల సమితి అయిన సంయుక్త కిసాన్ మోర్చా .. రైతులకు వారి పంటలకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చే చట్టం కోసం పార్లమెంటులో తమ డిమాండ్పై హామీ ఇవ్వాలని కోరుతోంది.
సోమవారం నాటి పార్లమెంట్ మార్చ్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, ప్రాణాలు కోల్పోయిన రైతులకు స్మారక చిహ్నం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని ప్రధానికి లేఖ రాసినట్లు ఎస్కేఎం నేత దర్శన్పాల్ తెలిపారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండ, ఇతర సమస్యలపై అజయ్ మిశ్రా 'తేని'ని కేంద్ర మంత్రివర్గం నుండి సస్పెండ్ చేయడంపై మాత్రం కేంద్రం నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని, డిసెంబర్ 4న ఎస్కెఎం మరో సమావేశం నిర్వహిస్తుందని చెప్పారు.
కేంద్రం ప్రభుత్వం తమతో గౌరవప్రదంగా చర్చలు జరపాలని ఎస్కేఎం డిమాండ్ చేస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు గత వారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా మిగతా డిమాండ్లపై మాత్రం రైతు సంఘాలు పట్టు వీడటం లేదు. ప్రభుత్వ చర్యను రైతు సంఘాలు స్వాగతించినప్పటికీ, చట్టాలను పూర్తిగా, అధికారికంగా ఉపసంహరించుకునే వరకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీతో సహా ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసన కొనసాగుతుందని చెప్తున్నాయి.