చలిమంట పొగ.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
పుణె: చలి తీవ్రంగా ఉండటంతో దాన్నుంచి ఉపశమనం పొందేందుకు వేసుకున్న చలిమంట ఆ కుటుంబసభ్యుల ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పుణె నగరంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్పేట్ ప్రాంతంలోని కబీర్బాగ్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం చలి కాచుకోవడానికి బొగ్గులు వెలిగించుకున్నారు.
ఆ తర్వాత అన్ని తలుపులు మూసేసి నిద్రపోయారు. అయితే చలిమంట నుంచి ఎక్కువగా కార్భన్ డై అక్సైడ్ విడుదల కావడంతో.. ఆ గాలిని పీల్చుకున్న ముగ్గురు కుటుంబసభ్యులు ఊపిరాడక మృతి చెందారని పోలీసులు తెలిపారు. అన్ని తలుపులు వేసివుండటంతో ఆ గాలి గదిలోనే ఉండిపోయిందని చెప్పారు.
ఆ కుటుంబంలోని ముగ్గురు భగవాన్ దోండిబా ఘరే(55), ఆయన భార్య మంగళ(50), వారి కూతురు పూర్ణిమ (22) ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. భగవాన్ మరో కుమారుడు ధీరజ్ ఆరోజు వేరే ఇంట్లో ఉండటంతో అతనొక్కడే బతికాడని చెప్పారు.
ఆదివారం ఉదయం ధీరజ్, పని మనిషులు ఇంటికి వచ్చి తలుపులుకొట్టగా.. ఎవరూ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు తెరిచారు. అప్పటికే ముగ్గురు స్మృహకోల్పోయి ఉన్నారు. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు.