ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు...ఒడిశా తీరం వైపు కదలనున్న 'ఫొని'
Recommended Video
పెను తూఫానుగా మారిన ఫొని ముప్పు ఉత్తరాంధ్రకు తప్పింది. ఒడిశా తీరంవైపు కదులుతున్న ఫొని అక్కడే తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మే 4న తుఫాను ఒడిశా తీరం దాటి బెంగాల్ వైపు కదులుతుందని స్పష్టం చేసింది. అయితే ఫొని కోస్తా తీరం వెంట పయనించే సమయంలో అంటే మే 3, 4 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

3 జిల్లాలపై ప్రభావం
ఫొని తుఫాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫొని ప్రభావంతో మంగళవారం ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 16కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఫొని తుఫాను.. మంగళవారం నాటికి అతి తీవ్ర తుఫానుగా మారనుంది

గం. 200కి.మీ. వేగంతో గాలులు
ప్రస్తుతం ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న ఫొని మే 1వ తేదీన దిశ మార్చుకుని ఒడిశా తీరంవైపు పయనించనుంది. 4వ తేదీవరకు ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణించనుండటంతో ఆ సమయంలో గంటకు 170 నుంచి 200కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో గంటకు 4- నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి.

సముద్రం అల్లకల్లోలం
తుఫాను కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. విశాఖ, మచిలీపట్నం, నిజాం పట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.

సేవలకు సైన్యం సమాయత్తం
ఫొని తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సన్నద్ధమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేవీ, ఎయిర్ఫోర్స్ నౌకలు, హెలికాప్టర్లను సిద్ధం చేశాయి. తుఫాను బాధితులను ఆదుకునేందుకు రబ్బరు పడవలు, పునరావాస సౌకర్యాలు, ఆహార సామాగ్రిని సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో చికిత్స అందించేందుకు డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications