నికితపై అందుకే రివేంజ్ తీర్చుకున్నా... ఫరీదాబాద్ హత్య కేసులో నిందితుడి వెర్షన్ ఇదే...
హర్యానాలోని ఫరీదాబాద్ బల్లబ్ఘర్లో సంచలనం రేకెత్తించిన బీటెక్ విద్యార్థిని నికిత తోమర్ హత్య కేసులో నిందితుడు తౌసిఫ్ పోలీసుల విచారణలో నేరం అంగీకరించాడు. నికిత వేరొకరిని పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉందని... అందుకే ఆమెను హత్య చేశానని చెప్పాడు. అంతేకాదు,2018లో కిడ్నాప్ ఆరోపణలతో తనను అరెస్ట్ చేయించి మెడిసిన్ చదవాలన్న తన కోరిక నెరవేరకుండా చేసినందుకు నికితపై రివేంజ్ తీర్చుకున్నట్లు తెలిపాడు. హత్యకు ముందు రోజు(అక్టోబర్ 24-25) రాత్రి నికిత-తౌసిఫ్ ఫోన్లో మాట్లాడుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సుమారు 16 నిమిషాల పాటు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. అయితే ఆ వివరాలేవీ ఇంకా వెల్లడించలేదు.
నికిత మర్డర్ కేస్: కామర్స్ విద్యార్థినిపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో: ముఖ్యమంత్రి స్టేట్మెంట్
2018లో నికిత కిడ్నాప్...
కొన్నేళ్లుగా నికితను పెళ్లి కోసం తౌసిఫ్ బలవంతం చేస్తున్నట్లు ఆమె కుటుంబం ఆరోపించిన సంగతి తెలిసిందే. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలంటూ నికితను అతను వేధింపులకు గురిచేశాడని... ఇది 'లవ్ జిహాదీ' కోణంలో జరిగిన హత్యేనని ఆరోపించింది. 2018లో తౌసిఫ్ తమ సోదరిని కిడ్నాప్ చేశాడని... అప్పట్లో అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని నికిత సోదరుడు తెలిపారు. పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేశారని... అయితే తమ ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఆ వివాదాన్ని సెటిల్ చేసుకున్నాయని చెప్పారు.
ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం
కోర్టు ఆదేశాల మేరకు నిందితులు తౌసిఫ్,రెహాన్లను పోలీసులు రిమాండుకు తరలించారు. ప్రధాన నిందితుడు తౌసిఫ్ నుహ్ నియోజకవర్గ ఎమ్మెల్యేకి దగ్గరి బంధువు అని చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మరో విద్యార్థి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. హత్య జరిగిన అక్టోబర్ 26,మధ్యాహ్నం 3.40గం. సమయంలో.. సంఘటనా స్థలానికి ఆమె కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నారు. తన కళ్లెదుటే కాల్పులు చోటు చేసుకోవడం భయాందోళనకు గురిచేసిందని ఆమె పోలీసులతో చెప్పారు. హఠాత్తుగా జరిగిన కాల్పులతో ఆ ప్రాంతంలో అలజడి రేగిందని తెలిపారు.
మృతదేహం తరలింపు...
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం(అక్టోబర్ 27) నికిత కుటుంబం రోడ్డెక్కింది. ఫరీదాబాద్-మథుర హైవేపై బైఠాయించింది. న్యాయం జరిగేంతవరకూ అక్కడినుంచి కదిలేదని లేదని తేల్చి చెప్పింది. అయితే పోలీసులు కలగజేసుకుని.. వారికి నచ్చజెప్పి అక్కడినుంచి పంపించారు. నికిత మృతదేహానికి పోస్టుమార్టమ్ అనంతరం భారీ పోలీసు భద్రతా నుడమ డెడ్ బాడీని అంత్యక్రియల కోసం తరలించారు. ఈ రాత్రికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ఆదేశించారు.