రైలు ప్రమాదాన్ని తప్పించిన రైతు
మంగళూరు: మంగళూరు నగర శివార్లలో రైలు పట్టాలు చీలిపోవడం గుర్తించిన ఒక రైతు రైలు నడుపుతున్న వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా వెళుతున్న రైలు చీలిపోయిన పట్టాలకు 30 మీటర్ల దూరంలో రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
రైల్వే అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళూరు నగర శివార్లలోని పచ్చనాడి ప్రాంతంలో ఫ్రాంక్లిన్ ఫెర్నాండిస్ అనే ఆయన నివాసం ఉంటున్నారు. ఈయన వ్యవసాయం చేస్తున్నాడు. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో పాలు తీసుకురావడానికి బయలుదేరారు.
రైల్వే బ్రిడ్జ్ సమీపంలో వెళుతున్న సమయంలో పట్టాల దగ్గర కొందరు గుమికూడి ఉన్న విషయం గుర్తించారు. ఫ్రాంక్లిన్ అక్కడికి బయలుదేరారు. అదే సమయంలో బస్సు రావడంతో అక్కడ గుమికూడిన వారు బస్సులో వెళ్లిపోయారు.
సమీపంలో నిలబడి ఉన్నపీటర్ అనే వ్యక్తిని ఏమి జరిగింది అని ప్రశ్నించాడు. అతను రైలు పట్టాలు చీలిపోయాయని అన్నాడు. వెంటనే ఫ్రాంక్లిన్ తన స్నేహితుడికి ఫోన్ చేసి రైల్వే కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ ఇవ్వాలని చెప్పాడు.
అతను టెలిఫోన్ డైరెక్టరి పరిశీలించి నెంబర్ ఇస్తానని అన్నాడు. అంతలోపు మంగళూరు-మడగాంవ్ ఎక్స్ ప్రెస్ రైలు అటు వైపు వస్తున్నదని ఫ్రాంక్లిన్ కు తెలిసింది. వెంటనే రోడ్డు పక్కన ఉన్న ఎర్రటి పూలు కొసుకుని ఒక పెద్ద కర్రకు పెట్టుకుని ఫ్రాంక్లిన్, పీటర్ రైలు వస్తున్న వైపు పరుగు తీశారు.
శక్తి వంచన లేకుండ పరుగు తీసి ఎదురుగా వస్తున్న రైలుకు ఎర్రటి పూలు చూపిస్తూ చేతులు ఊపుతూ రైలు నిలపాలని సైగలు చేశారు. రైలు నడుపుతున్న వ్యక్తి విషయం గుర్తించి మెల్లగా రైలు నిలిపివేశాడు. తరువాత విషయం గుర్తించి పై అధికారులకు సమాచారం అందించారు.
రైల్వే అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రైలు పట్టాలు తాత్కలికంగా మరమత్తులు చేశారు. ఒక గంట ఆలస్యంగా రైలు బయలుదేరింది. రైతు ఫ్రాంక్లిన్ తో పాటు పీటర్ ను రైల్వే శాఖ అధికారులు అభినందించారు.