Farmers Protest : రైతు నిరసనలు తీవ్రతరం- రేపు దేశవ్యాప్త చక్కాజామ్- రోడ్ల దిగ్బంధం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలలుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా కేంద్ర ప్రభుత్వం కనికరం లేకుండా ఎదురుదాడి చేయడాన్ని రైతు సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు నిరసనల తర్వాత తమపై ఉక్కుపాదం మోపేందుకు ఇంటర్నెట్పై నిషేధం విధించడం, పోలీసుల వేధింపుల నేపథ్యంలో రేపు చక్కా జామ్కు రైతు సంఘాలు సన్నద్దమవుతున్నాయి.
ఢిల్లీ సరిహద్దుల్లో ఘాజీపూర్తో పాటు ఇతర ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో రిపబ్లిక్ డే తర్వాత కేంద్రం ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. దీంతో పాటు పోలీసుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. చివరికి రైతులకు రోజూ తాగేందుకు, మలమూత్రాల విసర్జన కోసం నీళ్లు లేకుండా చేస్తున్న పరిస్ధితి ఉంది. దీంతో రైతులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేపు ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో జాతీయ రహదారులన్నీ దిగ్భందించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.

చక్కా జామ్ పేరుతో రేపు జాతీయ రహదారుల్ని దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. అయితే శాంతియుతంగానే నిర్వహిస్తామని తికాయత్ వెల్లడించారు. రిపబ్లిక్ డే ఘటనల తర్వాత రైతులపై విమర్శల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఉదయం మూడు గంటల పాటు రోడ్లను దిగ్బంధిస్తామని ఆయన తెలిపారు. రైతుల చక్కా జామ్ నేపథ్యంలో ఢిల్లీతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రిపబ్లిక్ డే ఘటనల నేపథ్యంలో కేంద్రం సీరియస్ కావడంతో ఈసారి ఎలాంటి అవాంఛనీయ పరిస్దితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications