విపక్షాలపై మోడీ ఫైర్- వ్యవసాయ బిల్లులపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విసుర్లు..
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై గందరగోళం కొనసాగుతోంది. విపక్షాలతో పాటు ఎన్డీయే మిత్రపక్షమైన అకాలీదళ్ సైతం ఈ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అకాలీదళ్ ఇప్పటికే తమ పార్టీకి చెందిన కేబినెట్ మంత్రి హర్సిమ్రత్ కౌర్తో రాజీనామా కూడా చేయించింది. పంజాబ్, హర్యానా, యూపీ వంటి రాష్ట్రాల్లో బిల్లులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత నేపథ్యంలో ఇవాళ బీహార్లో రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ స్పందించారు. వ్యవసాయ బిల్లులపై దేశంలో కొందరు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విపక్షాలను ఉద్దేశించి మోడీ ఆరోపించారు. ఓ వైపు రైతులకు పారదర్శకమైన ధరలు లభించేలా చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంటే కొందరు మాత్రం రైతులకు వ్యవసాయ బిల్లులు అమల్లోకి వస్తే గిట్టుబాటు ధరలు రావని రెచ్చగొడుతున్నారని మోడీ తెలిపారు. ఈ బిల్లులు అమల్లోకి వస్తే రైతులు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకునేందుకు అవకాశం కలుగుతుందని మోడీ గుర్తుచేశారు.

Recommended Video
కేంద్రం తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లుల వల్ల రైతులు దళారుల ప్రమేయం లేకుండా తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ బిల్లులు వారికి రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయన్నారు. కానీ కొందరు ఈ బిల్లులు అమల్లోకి రాకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆక్షేపించారు. వీరు నిరసనల కోసం నిరసనలు చేస్తున్నారే కానీ రైతుల మీద వీరికి ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఈ దేశంలో రైతులు వారిని నిశితంగా గమనిస్తున్నారని, ఎవరు దళారులో వారికి బాగా తెలుసన్నారు.












Click it and Unblock the Notifications