వ్యవసాయ చట్టాల రద్దు తప్ప.. ఏదైనా అడగండి: కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని సరిహద్దులో రైతు సంఘాల నేతలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అధిక భాగం రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉన్నారని చెప్పారు.
ఆందోళనలు చేస్తున్న రైతులతో జనవరి 19న మరో విడత చర్చలు నిర్వహించనున్నామని ఆయన ఆదివారం నిర్వహించిన ఓ సమావేశంలో వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు చాలా మంది రైతులు, నిపుణులు అనుకూలంగా ఉన్నారని తెలిపారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదని, కాబట్టి రైతులు నిబంధనల ప్రకారమే తదుపరి చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ కాకుండా రైతులు తమ సమస్యలు ఏంటో ప్రభుత్వానికి చెప్పాలని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

మండీలు, ట్రేడర్ల రిజిస్ట్రేషన్, పంట వ్యర్థాల దహనం, కరెంటు సహా ఇతర విషయాలపై రైతుల భయాలను పరిష్కరించడానికి అంగీకరం తెలుపుతూ.. ప్రభుత్వం తరపున ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కానీ, రైతు సంఘాలు చట్టాలను వెనక్కి తీసుకోవాలనే ఒకే విషయాన్ని డిమాండ్ చేస్తున్నాయన్నారు.
ఢిల్లీ సరిహద్దులో లక్షలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చట్టాల్ని రద్దు చేయకపోవడం ఏంటని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ తికాయితో ప్రశ్నించారు.
కాగా, నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో సుమారు 50 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతు సంఘాల నేతలతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ.. సఫలం కాలేదు. దీంతో జనవరి 19న మరోసారి చర్చలు జరగనున్నాయి. కాగా, జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేస్తామంటూ రైతులు పేర్కొనడం గమనార్హం.












Click it and Unblock the Notifications