మహా నిరసన : నేడు రైతుల నిరాహార దీక్ష... ఢిల్లీకి మరో 10వేలమంది...
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు సోమవారం(డిసెంబర్ 14) 19వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకరోజు నిరాహార దీక్షకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సోమవారం ఉదయం 8గం. నుంచి సాయంత్రం 5గం. వరకు దేశవ్యాప్తంగా రైతు నిరాహార దీక్షలతో పాటు నిరసన ర్యాలీలు జరగనున్నాయి. భారత్ బంద్ నిర్వహించి వారం రోజులు కూడా కాకముందే రైతులు మరోసారి దేశవ్యాప్త నిరసనకు పూనుకోవడం గమనార్హం. మరోవైపు ఢిల్లీ సరిహద్దులకు వేలాది మంది రైతులు ఇంకా పోటెత్తుతూనే ఉన్నారు.
Recommended Video
ఒకరోజు నిరాహార దీక్ష... దేశవ్యాప్తంగా ర్యాలీలు...
సోమవారం(డిసెంబర్ 14) దేశవ్యాప్తంగా రైతుల ఒకరోజు నిరాహార దీక్ష జరుగుతుందని ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఢిల్లీ సరిహద్దులోని సింఘు పాయింట్ వద్ద రైతు నాయకుడు గుర్నం సింగ్ చదుని ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. నిరాహార దీక్షతో పాటు ఆయా జిల్లా కేంద్రాల్లో రైతులు నిరసన ర్యాలీలు చేస్తారని చెప్పారు. ఆదివారం జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులు రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు అక్కడికి వెళ్లగా... రైతు సంఘాల నాయకులు వారిని అనుమతించకపోవడం గమనార్హం. ఢిల్లీ గేట్-ఘాజీపూర్ బోర్డర్ వద్దకు వచ్చిన ఆరుగురు జామియా వర్సిటీ విద్యార్థులు... రైతులు అనుమతించకపోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు.
మరో 10వేల మంది రైతులు...
ఢిల్లీ సరిహద్దులోని సింఘు పాయింట్ వద్దకు వేలాదిమంది రైతులు ఇంకా చేరుకుంటూనే ఉన్నారు. సోమవారం నాటికి మరో 10 వేల మంది రైతులు అక్కడికి చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. సింఘు బోర్డర్ వద్దకు వెళ్తున్న రైతులంతా ఎక్కువ రోజులు అక్కడ ఉండేందుకు సిద్దమై వెళ్తున్నారు. 'మా డిమాండ్ నెరవేరే వరకు ఎన్ని నెలలైనా సరే మేమిక్కడి నుంచి కదిలేది లేదు. మేము ఆకలికి తపించి చనిపోతామని ప్రభుత్వం భావిస్తుండవచ్చు. వాళ్ల భావన తప్పు.ఇక్కడున్న ప్రతీ ఒక్కరూ పోరాట యోధులే.. మేమంతా ఐక్యంగా పోరాడుతాం.' అని గుర్నమ్ సింగ్ తెలిపారు.
మరో క్యాంపు...
రాజస్తాన్,హర్యానాల నుంచి ఢిల్లీకి బయలుదేరిన రైతులను ఆదివారం షాజహాన్పూర్ వద్ద పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్,యాక్టివిస్ట్ మేదా పాట్కర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను బలవంతంగా వారితో ఒప్పించేలా చేయడం ఆశ్చర్యంగా ఉందని యోగేంద్ర యాదవ్ అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పోలీసులు అడ్డుకోవడంతో ఢిల్లీ-జైపూర్ నేషనల్ హైవేని ఆనుకుని ఉన్న జల్సింగ్పూర్ ఖేడా వద్ద క్యాంపును ఏర్పాటు చేసుకోవాలని రైతులు నిర్ణయించారు.