Farmers Protest: జైళ్లు చాలట్లేదు: స్టేడియాలు..కారాగారాలుగా: కేజ్రీవాల్ సర్కార్ ఏమంటోంది?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్రతరమౌతోంది. రోజురోజుకూ ఉధృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఢిల్లీ ఛలో పేరుతో సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కిసాన్ సంఘర్ష సమన్వయ కమిటీ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చింది. వేలాదిమంది రైతులు ఇందులో పాల్గొంటున్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయట్లేదు. తమ నినరసన గళాన్ని కేంద్ర ప్రభుత్వానికి వినిపించడానికి దేశ రాజధాని వైపు ప్రదర్శనగా తరలి వెళ్తున్నారు.
రైతులు చేపట్టిన ఈ మహా ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఆయా రాష్ట్రాల సరిహద్దులను మూసివేశారు. హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ మూసివేశారు. సరిహద్దుల్లో పారామిలటరీ బలగాలను మోహరింపజేశారు. ఇనుప బ్యారికేడ్లను అమర్చారు. కంచెలను ఏర్పాటు చేశారు. వాటర్ క్యానన్లతో రైతులను చెదరగొడుతున్నారు. రైతుల ఉద్యమం ముందు అవేవి నిలవట్లేదు. ఆంక్షలను అధిగమించిన వారు ఢిల్లీలో అడుగు పెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
రైతులను అడ్డుకునే క్రమంలో వారిని అదుపులోకి తీసుకుంటున్నారు ఢిల్లీ పోలీసులు. ప్రదర్శనను భగ్నం చేస్తున్నారు. రైతులను పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని.. జైళ్లకు తరలిస్తున్నారు. ఇప్పుడా జైళ్లు చాలట్లేదు. వందలాది మంది ఢిల్లీ వైపు తరలివస్తుండటంతో మరింత మందిని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని ఢిల్లీ పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కారాగారాలు సరిపోవని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని తొమ్మిది స్టేడియాలను తాత్కాలిక కారాగారాలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
దీనికోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుమతి కోరారు. ఢిల్లీ జింఖానా, జవహర్ లాల్ నెహ్రూ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, తాల్కటోరా ఇండోర్ స్టేడియం, ఫిరోజ్ షా కోట్లా స్టేడియం, మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం, ఆర్కే ఖన్నా స్టేడియం, పసిఫిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లను తాత్కాలిక కారాగారాలుగా మార్చడానికి అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు.. కేజ్రీవాల్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. దీనికి కేజ్రీవాల్ ప్రభుత్వం అంగీకరించకపోవచ్చని అంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలను తీసుకోకపోవచ్చని తెలుస్తోంది.