రైతుల ఆందోళన ఉధృతం : అవసరమైతే లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్ ముట్టడిస్తామని హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తున్న రైతులు పలు రకాలుగా తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీ బోర్డర్ లో, దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన నిర్వహించిన రైతులు రైతు ఉద్యమాన్ని ఉధృతం చేసి క్రమంలో భాగంగా కిసాన్ మహా పంచాయత్ లు నిర్వహించడానికి వివిధ రాష్ట్రాలలో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రభుత్వంపై విరుచుకుపడిన రైతు సంఘం నాయకులు
ఒకపక్క బోర్డర్లో ఆందోళన కొనసాగిస్తూనే, మరోపక్క వివిధ రాష్ట్రాల ప్రజల నుండి ,రైతుల నుండి మద్దతు కూడగడుతున్నారు. ఇక రైతుల ఆందోళన వంద రోజులు పూర్తయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. పట్టిన పట్టు విడవకుండా వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదని కేంద్ర సర్కార్ తేల్చి చెబుతోంది. నల్ల చట్టాలను రద్దు చేస్తేనే తిరిగి ఇంటికి వెళతామని లేదంటే అప్పటి వరకు ఇంటికి వెళ్ళేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా మరోమారు రైతు సంఘం నాయకులు ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

అవసరమైతే లక్షలాది ట్రాక్టర్లతో పార్లమెంట్ ను ముట్టడిస్తామని వార్నింగ్
నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ మరోమారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే లక్షలాది ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన కేంద్ర సర్కారును హెచ్చరించారు . మధ్యప్రదేశ్ లోని షియో పూర్ లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న రాకేష్ టికాయత్ మధ్యప్రదేశ్ బీజేపీ నేత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వ్యవసాయ మంత్రి తోమర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాకేశ్ టికాయత్
మీరు ఎన్నుకున్న నేత సొంతగా నిర్ణయాలు తీసుకోలేరని, రైతులతో సమావేశాలకు కూడా ఆయన ఫైల్ పట్టుకొని వచ్చారని వాటి ఆధారంగానే సమాధానం ఇస్తారని టికాయత్ తీవ్ర విమర్శలు చేశారు.
రిపబ్లిక్ డే రోజు 3500 ట్రాక్టర్లతో కిసాన్ పెరేడ్ నిర్వహించామని గుర్తు చేసిన రాకేష్ టికాయత్ మూడు సాగు చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ రైతులు మరోమారు ప్రదర్శనలు చేయడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు భావిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా మద్దతు కోసం రైతు మహా పంచాయితీలు, ఉధృతం చేస్తున్న ఆందోళనలు
ప్రస్తుతం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న రైతులు మద్దతును కూడగడుతున్నారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా మార్చి 14వ తేదీ రెవా, మార్చి 15వ తేదీన జబల్పూర్ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ , ఉత్తరాఖండ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలలో టికాయత్ పర్యటించి రైతులతో సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications