రైతుల ఆందోళన .. పంజాబ్, హర్యానాలలో టవర్ల ధ్వంసంపై కోర్టు మెట్లెక్కిన రిలయన్స్ సంచలన ప్రకటన
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో రైతులు గత కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరుతుందని నిరసనలు తెలియజేస్తున్న రైతులు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పలు రిలయన్స్ జియో మొబైల్ టవర్లను, ఇతర సంస్థలను ధ్వంసం చేస్తున్నందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కోర్టు మెట్లెక్కింది .

వ్యవసాయ చట్టాలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న రిలయన్స్
రైతులు ఆందోళన నేపథ్యంలో జియో ఆస్తుల విధ్వంసాన్ని ఆపడానికి పంజాబ్ ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రిలయన్స్ తన పిటిషన్లో, మూడు వ్యవసాయ చట్టాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మరియు వాటి నుండి ప్రయోజనం పొందాలని చూడటం లేదని పేర్కొంది. పంజాబ్ ,హర్యానా కోర్టులలో తమ సంస్థ ఆస్తులను ధ్వంసం పై ఈ పిటిషన్ లు దాఖలు చేసిన క్రమంలో ప్రకటన విడుదల చేసింది రిలయన్స్.

కార్పొరేట్ వ్యవసాయం వ్యాపారంలోకి ప్రవేశించే ప్రణాళికలు లేవని ప్రకటన
వ్యవసాయ చట్టాలతో రిలయన్స్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని చక్కర్లు కొడుతున్న వార్తలను ఖండించింది .రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తమకు కార్పొరేట్ వ్యవసాయం వ్యాపారం లోకి ప్రవేశించే ప్రణాళికలు లేవని తేల్చి చెప్తుంది. అందువల్ల, రిలయన్స్ పేరును ఈ చట్టాలతో అనుసంధానించడం వెనుక దురుద్దేశం ఉందని, అది తమ వ్యాపారాలకు హాని కలిగిస్తుందని , తమ ప్రతిష్టను దెబ్బతీయడం చేస్తుందని రిలయన్స్ సోమవారం తన ప్రకటనలో తెలిపింది.
Recommended Video

ఆస్తుల ధ్వంస ఘటనలు వేలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడేశాయన్న రిలయన్స్
రిలయన్స్ తన పిటిషన్లో, ఈ హింస చర్యలు వేలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడేశాయి మరియు రెండు రాష్ట్రాలలో దాని అనుబంధ సంస్థలు నిర్వహిస్తున్న కీలక సమాచార మౌలిక సదుపాయాలు, అమ్మకాలు మరియు సేవా సంస్థలకు నష్టం తో పాటుగా అంతరాయం కలిగించాయని పేర్కొంది.
వారం రోజుల్లో పంజాబ్లో రోజూ 200 కి పైగా రిలయన్స్ జియో టవర్లు దెబ్బతిన్నాయని, వ్యవసాయ చట్టాలకు, రిలయన్స్ జియోకు వ్యతిరేకంగా కోపంతో ఉన్న రైతులు నిరసన వ్యక్తం చేశారని ఆరోపించారు.
గత వారం, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పంజాబ్ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మరియు పంజాబ్ డిజిపికి పంజాబ్లోని జియో నెట్వర్క్ సైట్లలో విధ్వంసం పై జోక్యం చేసుకోవాలని కోరుతూ లేఖ రాశారు.

రైతుల ఉద్యమం తీవ్రతరం .. 1,500 కి పైగా రిలయన్స్ జియో టవర్ల ధ్వంసం
కేంద్ర వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రతరం కావడంతో కోపంతో ఉన్న రైతులు గత వారం రోజుల్లో 1,500 కి పైగా రిలయన్స్ జియో టవర్లను ధ్వంసం చేశారని నివేదికలు సూచించాయి. విధ్వంసానికి పాల్పడవద్దని సిఎం అమరీందర్ సింగ్ రైతులకు విజ్ఞప్తి చేసినప్పటికీ రైతుల ఆందోళనలో పలు మొబైల్ టవర్స్ ధ్వంసమయ్యాయి.
డిసెంబర్ 25 న, 700 మొబైల్ టవర్స్ విద్వంసం కాగా మూడు రోజుల్లో ఈ సంఖ్య 1,504 కు పెరిగింది. పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 9,000 టవర్లు ఉన్నాయి.

రైతుల పంటకు గిట్టుబాటు ధరల అంశానికి రిలయన్స్ మద్దతు
జియో యొక్క ఫైబర్ కేబుల్ బండిల్స్ జలంధర్లో తగలబెట్టారు. అంతేకాదు జియో ఉద్యోగులను బెదిరించి పారిపోయేలా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక కార్పొరేట్ వ్యాపారానికి సంబంధించి తాము ఎటువంటి భూమిని కొనుగోలు చేయలేదని భవిష్యత్తులో ఎలాంటి ఆలోచనలు కూడా లేవని రిలయన్స్ స్పష్టం చేసింది . రైతులు ఎంతో శ్రమతో పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించే అంశాలకు రిలయన్స్ దాని అనుబంధ సంస్థలు పూర్తిగా మద్దతు ఇస్తున్నాయని, ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా కనీస మద్దతు ధరకు కట్టుబడి ఉండాలని మా సరఫరాదారులకు కూడా చెప్తున్నామని తన ప్రకటనలో వెల్లడించింది.












Click it and Unblock the Notifications