మరో ట్రాక్టర్ ర్యాలీకి సిద్దమవుతున్న రైతులు-ఈసారి పటియాలాలో
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్న రైతులు ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ కూడా నిర్వహించారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో వ్యూహాత్మకంగా వెనక్కితగ్గిన రైతులు ఇప్పుడు మరో ట్రాక్టర్ల ర్యాలీకి సిద్దమవుతున్నారు. పంజాబ్లోని సీఎం నివాసం సమీపంలో నిరసనలు చేస్తున్న రైతులు ఈసారి పటియాలాలో ర్యాలీ నిర్వహించబోతున్నారు.
పంజాబ్లోని పటియాలాలో ఉన్న సీఎం అమరీందర్ సింగ్ నివాసం సమీపంలో కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్న రైతు సంఘాలు ఇవాళ సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నాయి. రోడ్ కిసాన్ సంఘర్ష్ సమితి పేరుతో ఆందోళనలు నిర్వహిస్తున్న ఇక్కడి రైతులు ఏప్రిల్ 30న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఏప్రిల్ 30లోపు కేంద్రం తమ డిమాండ్లు అంగీకరించపోతే ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి తీరుతామని రైతు సంఘాలు ప్రకటించాయి.
త్వరలో పంజాబ్లో వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్నప్పటికీ దాన్ని వదిలిపెట్టి ఆందోళనల్లో పాల్గొనాలని రైతులు నిర్ణయించారు. ఈ మేరకు అన్ని రైతు సంఘాలు ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆందోళనలనకు మద్దతు లభిస్తున్న నేపథ్యంలో రైతు సంఘాలు త్వరలో తమ ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహరచన చేస్తున్నారు.