రైతులకు సుప్రీం షాక్ -రిపబ్లిక్ డేన ట్రాక్టర్ల ర్యాలీ శాంతి భద్రతల ఇష్యూ -ఎలా డీల్ చేస్తారో పోలీసుల ఇష్టం
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు సంబంధించిన మరో అంశంపై అత్యున్నత న్యాయస్థానం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ శాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహారమని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఢిల్లీ పోలీసులే అని సీజేఐ బెంచ్ పేర్కొంది.
రిపబ్లిక్ డేన రైతులు నిర్వహించతలబెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై ఇన్జంక్షన్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. కేంద్రం(ఢిల్లీ పోలీసుల) తరుఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. జాతీయ పండుగ రోజున రైతుల ర్యాలీ చట్టవిరుద్ధమవుతుందని, ఢిల్లీలోకి 5000 మంది ప్రజలు అడుగుపెట్టే అవకాశం ఉందని చెప్పారు. దీనికి కోర్టు..

గణతంత్ర దినోత్సవం రోజున ర్యాలీ అనేది పూర్తిగా శాంతిభద్రతల అంశమని, పోలీసులు ఏం చేయాలో కోర్టు చెప్పాల్సిన అవసరం లేదని, రైతులను ఢిల్లీలోకి అనుమతించాలా వద్దా అనేది పోలీసులే నిర్ణయించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ వినీత్ శరణ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది..
రైతుల జనవరి 26న తలపెట్టిన ర్యాలీపై నిర్ణయం తీసుకోవాల్సింది పోలీసులేనన్న ధర్మాసనం.. పిటిషన్ విచారణను బుధవారానికి(జనవరి 20కి) వాయిదా వేసింది. కాగా, రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా తాము ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాలు పదే పదే ప్రకటనలు చేశాయి. ముందుగా చెప్పనట్లు ఎర్రకోట వద్ద కాకుండా, ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోనే ర్యాలీ చేపడతామని నేతలు చెప్పారు. మరోవైపు రైతుల ఆందోళన వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మంగళవారం భేటీ కానుంది.












Click it and Unblock the Notifications