ఢిల్లీలో పిట్టల్లా రాలిపోతున్న కరోనా పేషెంట్లు... రికార్డు స్థాయిలో 381 మరణాలు...
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 381 మంది కరోనాతో మృతి చెందారు. గతేడాది కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. ఇక కొత్తగా మరో 24,149 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 98వేలకి చేరింది. కరోనా పాజిటివిటీ రేటు 32,72శాతానికి చేరింది.
ఢిల్లీ ఆస్పత్రుల్లో ఇప్పటికీ పడకల కొరత,ఆక్సిజన్ కొరత నెలకొంది. దీంతో సకాలంలో వైద్యం అందక చాలామంది పేషెంట్లు మృతి చెందుతున్నారు. ఆక్సిజన్ సపోర్ట్ అవసరమవుతున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటం... సకాలంలో వారికి ఆక్సిజన్ అందకపోతుండటంతో మరణాలు పెరుగుతున్నాయి. గత వారం ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఒక్క సర్ గంగారాం ఆస్పత్రిలోనే 20 పైచిలుకు పేషెంట్లు ఆక్సిజన్ కొరతతో మరణించారు.

ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కి తరలిస్తుండటంతో ఆస్పత్రుల్లో దానికి కొరత ఏర్పడింది. ప్రభుత్వం దీన్ని డీల్ చేయడంలో విఫలమవుతుందోని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్లకు ఆక్సిజన్ పంపిణీ చేసి చేతులు దులిపేసుకుంటే ఎలా అని ప్రశ్నించింది. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్కి తరలకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు.. ఒకవేళ మీకు చేతకాకపోతే చెప్పండి... కేంద్ర అధికారులకు ఆ బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే తాము చూస్తూ ఊరుకోలేమని వ్యాఖ్యానించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా యుద్దప్రాతిపదికన చేపడుతున్నామని... దీనిపై పర్యవేక్షణ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో చాలినంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని... అయితే దాన్ని తరలించేందుకు తగినన్ని ట్యాంకర్లు అందుబాటులో లేవని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం థాయిలాండ్ నుంచి 18 క్రియోజెనిక్ ట్యాంకర్లు దిగుమతి చేసుకోనుంది. అలాగే ఫ్రాన్స్ నుంచి 21 రెడీ టు యూజ్ ఆక్సిజన్ ప్లాంట్లను దిగుమతి చేసుకోనుంది. వచ్చే నెలాఖరు నాటికి ఢిల్లీలో మొత్తం 44 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీరుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications