మరో వ్యక్తితో అక్రమ సంబంధం: ప్రేయసి పిల్లల హత్య
బెంగళూరు: అక్రమ సంబంధం కారణంగా ఒకే కుటుంబంలోని ముగ్గురు చిన్నారులను దారుణంగా హత్య చేసిన సంఘటన బెంగళూరు నగరంలోని బాణసవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ముగ్గురు చిన్నారులను మ్యాన్ హోల్ లో వేసి హత్య చేసిన ఫయూమ్ బేగ్ (24) అనే కిరాతకుడిని పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఆలీ అబ్బాస్ బేగ్ (8), ఉస్మా బేగం (6), రోహీం బేగ్ (4) అనే ముగ్గురు పిల్లలు హత్యకు గురైనారని మంగళవారం పోలీసులు చెప్పారు. ఈ ముగ్గురి మృతదేహాల కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. పిళ్ళణ్ణ గార్డెన్ లోని పాఠశాలకు ఆగస్టు 27న వెళ్లిన ఈ ముగ్గురు పిల్లలు హత్యకు గురైనారు.
ఇలియాస్ బేగ్, నాజియ బేగం అనే దంపతుల పిల్లలు ఈ ముగ్గురు. నాజియా బేగం, ఫయూమ్ బేగ్ అక్రమ సంబంధం సాగించారు. ఈ విషయం తెలుసుకున్న ఇలియాస్ బేగ్ ఆరు నెలల క్రితం భార్యతో తెగతెంపులు చేసుకుని హైదరాబాద్ వెళ్లిపోయాడు.
తరువాత ఫయూమ్ బేగ్ నిత్యం నాజియా బేగం ఇంటికి వెళ్లేవాడు. పిల్లల ముందే వీరు విచ్చలవిడిగా జల్సా చేసేవారు. ఇటీవల ఫయూమ్ బేగ్ చెప్పాపెట్టకుండ నాజియా బేగం ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో నాజియా బేగం వేరే వ్యక్తితో బెడ్ రూంలో ఉంది.
అప్పటి నుండి ఆమె పిల్లలను హత్య చెయ్యాలని ఫయూమ్ బేగ్ ప్లాన్ వేస్తున్నాడు. ఆగస్టు 27వ తేదిన స్కూల్ నుండి ఇంటికి వెళుతున్న పిల్లలను కిడ్నాప్ చేశాడు. తరువాత ముగ్గురిని కాడుగోండనహళ్ళి రింగ్ రోడ్డులోని అటవి ప్రాంతంలోకి తీసుకు వెళ్లి అక్కడే ఉన్న మ్యాన్ హోల్ లో వేసి హత్య చేశాడు.
పిల్లలు ఇంటికి రాకపోవడంతో నాజియా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వివిద కోణాలలో దర్యాప్తు చేశారు. చివరికి అనుమానం రావడంతో ఫయూమ్ బేగ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
ముగ్గురు పిల్లలను మ్యాన్ హోల్ లో వేసి హత్య చేశానని ఫయూమ్ బేగ్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు ముగ్గురు పిల్లల మృతదేహాల కోసం గాలించినా ఫలితం లేదని పోలీసులు అన్నారు. బాణసవాడి, హెబ్బాళ చెరువులలో మృతదేహాల కోసం గాలిస్తున్నారు.