మాజీ సీఎంల నియోజక వర్గాలకు బంఫర్ ఆఫర్: ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రులు బీఎస్. యడ్యూరప్ప, సిద్దరామయ్య నియోజక వర్గాలకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. బీఎస్. యడ్యూరప్ప ఎమ్మెల్యేగా ఉన్న శివమొగ్గ జిల్లాలోని శికారిపుర నియోజక వర్గం, సిద్దరామయ్య ఎమ్మెల్యేగా ఉన్న బాదామికి సీఎం కుమారస్వామి అధిక మొత్తంలో నిధులు కేటాయించారు.
శుక్రవారం ముఖ్యమంత్రి కుమారస్వామి విధాన సౌధలో 2019-20 బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మాజీ ముఖ్యమంత్రులు బీఎస్. యడ్యూరప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న శికారిపుర నియోజ వర్గం అభివృద్ది కోసం రూ. 200 కోట్లు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న బాగల్ కోటే జిల్లా బాదామి నియోజక వర్గం అభివృద్ది కోసం రూ. 300 కోట్లు కేటాయించారు.
కర్ణాటకలోని చెరువుల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కుమారస్వామి మొత్తం రూ. 1, 600 కోట్లు కేటాయించారు. తాగు నీటి సమస్య తీర్చడానికి, రైతుల సమస్యలు తీర్చడానికి చెరువులు అభివృద్ది కోసం ఈ నిధులు కేటాయించామని ముఖ్యమంత్రి కుమారస్వామి అసెంబ్లీలో చెప్పారు.
బీజేపీ నాయకులు చేపట్టిన ఆపరేషన్ కమలకు బ్రేక్ వెయ్యడానికే మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు బీఎస్. యడ్యూరప్ప ఎమ్మెల్యేగా ఉన్న శికారిపుర నియోజక వర్గానికి భారీ మొత్తంలో సీఎం కుమారస్వామి నిధులు కేటాయించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.