చట్టబద్ధతతో సంబంధం లేదు-క్రిప్టో కరెన్సీలపై పన్ను సమంజసమే-నిర్మల విచిత్ర వాదన
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో దేశవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలపై జనం ఆర్జించే లాభాలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. మన దేశంలో క్రిప్టో కరెన్సీల్ని కేంద్రం ఇంకా ఆమోదించలేదు. వాటికి చట్టబద్ధత ఉందా లేదా అనేది కూడా తెలీదు. మరోవైపు ఆర్బీఐ సైతం వీటిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా కేంద్రం మాత్రం వీటిపై వచ్చే లాభాలపై పన్ను విధింపుకు సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ రాజ్యసభలో సమర్ధించుకున్నారు.
కేంద్ర బడ్జెట్ పై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ సమాధానం ఇచ్చారు. ఇందులో ఆమె పలు అంశాల్ని ప్రస్తావించారు. క్రిప్టో కరెన్సీల ద్వారా వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధిస్తూ బడ్జెట్ లో తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఆర్ధికమంత్రి స్పందించారు. క్రిప్టో కరెన్సీలపై పన్ను విధించే సార్వభౌమాధికారం కేంద్రానికి ఉందని ఆమె తెలిపారు. క్రిప్టో కరెన్సీలను నిషేధిస్తామా లేదా అన్న దానితో దీనికి సంబంధం లేదన్నారు.
భారతదేశంలో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన చట్టబద్ధతలను కూడా నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. వర్చువల్ ఆస్తులపై పన్ను విధించడం అంటే ప్రభుత్వం దానిని చట్టబద్ధం చేస్తుందని కాదని ఆమె తెలిపారు. ఈ దశలో దీనిని చట్టబద్ధం చేయడానికి లేదా నిషేధించడానికి ప్రయత్నాలేవీ చేయడం లేదన్నారు. దీనిపై నిపుణులే నిర్ణయం తీసుకుంటారని ఆమె వెల్లడించారు. దీంతో వర్చువల్ ఆస్తులపై వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధించాలన్న తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని ఆర్ధికమంత్రి మరోసారి స్పష్టం చేసినట్లయింది.