వేరే దారిలో వెళ్లండి: అంబులెన్స్ ఇట్నుంచి వెళ్లడం కుదరదు: బెంగాల్ బీజేపీ చీఫ్, టీఎంసీ టాక్టిక్స్..
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నడియాలో భారతీయ జనతా పార్టీ ర్యాలీ, సభ జరుగుతోంది. ఆ ర్యాలీలో బీజేపీ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పాల్గొని ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో ఆ దారి గుండా ఓ అంబులెన్స్ వచ్చింది. అయితే, ఆ వాహనానికి దారి ఇవ్వడం సాధ్యం కాదని, మరో మార్గంలో వెళ్లాలని సూచించారు ఘోష్.
దారి ఇవ్వడం కుదరదంటూ..
దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనపై విమర్శలు సంధిస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు. భారీ ఎత్తున కూర్చున్న జనాలను డిస్టర్బ్ చేసి ఈ మార్గం గుండా అంబులెన్స్ దారి ఇవ్వడం కుదరదని.. వేరే మార్గంలో వేళ్లాలని ఘోష్ అంబులెన్స్ సిబ్బందికి సూచించారు.
మీటింగ్ జరుగుతోందని తెలిసినా..
‘ఇక్కడ మీటింగ్ జరుగుతోందని అంబులెన్స్ డ్రైవర్కు తెలుసు. అయినా ఈ మార్గం గుండానే ఎందుకు వచ్చినట్లు? అంబులెన్స్కు దారి ఇవ్వడం సాధ్యం కాదు. అనేకమంది ప్రజలు రోడ్డుపై కూర్చున్నారు. వారికి అంతరాయం కలుగుతుంది' అని దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు.
టీఎంసీ టాక్టిక్స్ అంటూ...
అంతేగాక, తాము నిర్వహిస్తున్న పబ్లిక్ మీటింగ్ను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)నే ఈ అంబులెన్స్ను పంపించిందని ఆరోపించారు. టీఎంసీ ఇలాంటి పనులే చేస్తుంది.. తమ ర్యాలీలకు అంతరాయం కలిగించేందుకు ఇలాంటి టాక్టిక్ ఉపయోగిస్తూ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ అంబులెన్స్లో పేషెంట్ కూడా ఎవరూ లేరని అన్నారు. కాగా, అంబులెన్స్ తిరిగి వెనక్కి వెళ్లడంతో ఆయన మద్దతుదారులు నినాదాలు చేశారు.
కాగా, కొత్తగా తీసుకొచ్చిన న్యూ మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం అంబులెన్స్ లాంటి ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ. 10వేల వరకు జరిమానా విధించడం జరుగుతుంది.