గాలిపై హత్యాయత్నం ఘటనలో అనూహ్య పరిణామం.. !!
కర్ణాటకలోని బళ్లారిలో గ్రూప్ తగాదాలు చోటు చేసుకున్నాయి. హవాంబావి ప్రాంతంలో రెండు రాజకీయ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. బ్యానర్ విషయంలో ఎమ్మెల్యేల వర్గీయుల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. గాల్లోకి కాల్పులూ జరిపారు. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నెల 3వ తేదీన బళ్లారిలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో నగరం అంతటా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో బళ్లారిలో నివసిస్తోన్న గంగావతి శాసన సభ్యుడు గాలి జనార్దన రెడ్డి నివాసం సమీపంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి బ్యానర్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు ఆయన మద్దతుదారులు. దీన్ని గాలి జనార్ధన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఆ సమయంలో జనార్ధన్ రెడ్డి ఇంట్లో లేరు. నియోజకవర్గం పర్యటనకు వెళ్లారు.

దీంతో వివాదం మొదలైంది. గాలివానగా మారింది. హింసాత్మకంగా రూపుదాల్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన ఈ వివాదం నగరం అంతటా శరవేగంగా పాకింది. ఇతర ప్రాంతాల నుంచీ వారి మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఘర్షణలకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైనా రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.
ఈ ఘటనపై గాలి జనార్దన రెడ్డి మాట్లాడారు. తాను నియోజకవర్గంలో ఉన్నప్పుడు భరత్ రెడ్డి మద్దతుదారులు తన ఇంటి ముందు కుర్చీలు వేసి రాకపోకలకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. ఇంటికి రాగానే, భరత్ రెడ్డి మద్దతుదారు సతీష్ రెడ్డికి చెందిన ప్రైవేట్ గన్మెన్లు నాలుగైదు రౌండ్ల పాటు కాల్పులు జరిపారని, ఇది తనపై జరిగిన హత్యాయత్నమని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన ఖాళీ తూటాను చూపించారు. నారా భరత్ రెడ్డి తనను హత్య చేయడానికి ప్రయత్నించారని జనార్దన రెడ్డి ఆరోపించారు.
ఈ ఘటన అనంతరం పోలీసులు శరవేగంగా స్పందించారు. బళ్లారిలో అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేశారు. బ్రూస్పేట్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదయ్యాయి. 11 మంది వ్యక్తులపై ఎఫ్ఐఆర్ పెట్టారు. వాల్మీకి బ్యానర్ను చించివేసిన ఆరోపణలు వారిపై ఉన్నాయి. ఈ కేసులో నిందితుల్లో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీరాములు, బీజేపీ నేతలు శేఖర్, అలీఖాన్, సోమశేఖర్ రెడ్డి వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు.












Click it and Unblock the Notifications