ఆస్పత్రిలో విషాద ఘటన: 24 మంది దుర్మరణం
భువనేశ్వర్: ఆస్పత్రిలో మంటలు లేచాయి. ఆస్పత్రిలో వేగంగా వ్యాపించిన మంటలతో రోగులు, వారి బంధవులు సజీవంగా దగ్ధమయ్యారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్లోని ఎస్యుఎం కార్పోరేట్ ఆసత్రిలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 24 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మొదటి అంతస్థులోని డయాలసిస్ వార్డులో మంటలు చెలరేగి అదే అంతస్థులోని ఐసీయూ తదితర విభాగాలకు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపకదళం అధికారులు తెలిపారు. ఆ సమయంలో వార్డులో 30 మంది వరకు పేషెంట్లు ఉన్నారు.

నాలుగు అంతస్థుల ఆస్పత్రి భవనంలో మొత్తం 500 మంది వరకు రోగులు ఉన్నారు. దట్టమైన పొగ వల్ల రోగులు, వారి బంధువులు పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పురవ్వలు ఎగిసిపడి క్షణాల్లో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపకదళం సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
మంటలు మొదలు కాగానే మొత్తం అందరు పేషంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, రోగులు ఊపిరాడక ఇబ్బంది పడతారని కొన్ని కిటికీల అద్దాలు బద్దలు కొట్టామని, తమ సొంత సిబ్బంది రోగులను కాపాడే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ బసంత్ పాటి చెప్పారు.
అయితే అగ్నిప్రమాదంలో ఎవరైనా రోగులు మరణించారా? అనేది ఆయన వివరించలేదు. పొగ వల్ల ఊపిరాడక ఇబ్బందు పడుతున్న కొందరు రోగులను క్యాపిటల్ హాస్పిటల్కు తరలించినట్టు పోలీసువర్గాలు తెలిపాయి. అయితే కొన్ని మృతదేహాలు క్యాపిటల్ హాస్పిటల్కు వచ్చాయని, మృతుల సంఖ్యను కచ్చితంగా చెప్పలేమని ఒడిశా ఆరోగ్యశాఖ ఆరతి ఆహుజా చెప్పారు.

కాగా 9 మృతదేహాలు వచ్చాయని, మంటల్లో గాయపడినవారిలో ఐదుగురిపరిస్థితి విషమంగా ఉందని క్యాపిటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ బినోద్కుమార్ మిశ్రా తెలిపారు. ఇదిలాఉండగా 37 మందిని తమ ఆస్పత్రిలో చేర్చారని, వారిలో 8 మంది మరణించారని సమీపంలోని అమ్రీ హాస్పిటల్ అధికారి ఒకరు చెప్పారు.












Click it and Unblock the Notifications