యూపీలో దారుణం; రెండేళ్ళ చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఈరోజు ఉదయం వారి ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఖవాజ్పూర్ ప్రాంతంలో జరిగిన వెన్నులో వణుకు పుట్టించిన దారుణ సంఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఒకే కుటుంబానికి చెందిన రామ్ కుమార్ యాదవ్ (55), అతని భార్య కుసుమ్ దేవి (52), కుమార్తె మనీషా (25), కోడలు సవిత (27), మనవరాలు మినాక్షి (2) లు దారుణంగా హత్యకు గురయ్యారు.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య
ఇక ఈ ఘటన నుండి మరో మనవరాలు సాక్షి (5) ప్రాణాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. నేరం జరిగిన సమయంలో ఇంట్లో లేని కారణంగా రామ్ కుమార్ యాదవ్ కుమారుడు సునీల్ (30) తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతను విచారణలో సహకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా హతమార్చి, ఆపై అగ్ని ప్రమాదం గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు దుండగులు. యాదవ్ ఇంటిలో మంటలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఐదుగురు దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.

దారుణ హత్యల దర్యాప్తుకు రంగంలోకి ఏడు బృందాలు
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు మరియు అగ్నిమాపక బృందాలు చేరుకున్నాక, మంటలను ఆపే క్రమంలో రామ్ కుమార్ యాదవ్ మరియు ఇతరుల మృతదేహాలు ఇంట్లో బయటపడ్డాయని, నేరం జరిగిన తరువాత సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ ఖత్రి పేర్కొన్నారు.
ఐదుగురి తలపై దెబ్బలు తగిలినట్లు మృతదేహాలపై గాయాల గుర్తులు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి అజయ్ కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపించామని, ఐదు దారుణ హత్యలపై దర్యాప్తు కొనసాగించటానికి ఏడు బృందాలను ఏర్పాటు చేశామని అధికారి తెలిపారు.

కుటుంబ హత్యలపై మృతుని కుమారుడిని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఓకే కుటుంబంలోని ఐదుగురిని హతమార్చింది ఎవరు? కుటుంబ కలహాలా? ఆస్తి తగాదాలా? లేక మరేదైనా కారణం ఉందా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామ్ కుమార్ యాదవ్ కుమారుడు సునీల్ యాదవ్ ను విచారిస్తున్నారు. అతను చెప్పే వివరాలను బట్టి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.

హంతకుల ఆధారాల కోసం రంగంలోకి డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు
హంతకుల ఆధారాలను సేకరించేందుకు డాగ్ స్క్వాడ్లు, ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు.
ఈ కేసును త్వరితగతిన విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని మృతుల తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మార్మ్రోగిపోతుంది. ప్రయాగ్ రాజ్ జిల్లాలో దారుణమైన నేరం జరిగిన వారం రోజులకే తాజాగా మరో దారుణమైన నేరం జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. .

ప్రయాగ్ రాజ్ లో వారం రోజుల ముందే మరో దారుణం
అంతకు ముందు ఏప్రిల్ 16న, ఖగల్పూర్ గ్రామంలో, 38 ఏళ్ల మహిళ ప్రీతి తివారీ మరియు ఆమె ముగ్గురు కుమార్తెలు, మహి (12), పిహు (8), కుహు (3) లను గొంతు కోసి హతమార్చి మహిళ భర్త రాహుల్ ఉరి వేసుకుని చనిపోయాడు. సంఘటన స్థలంలో దొరికిన సూసైడ్ నోట్, రాహుల్ రాసినట్లు స్పష్టంగా ఉంది. అతని అత్తమామలు మానసిక వేధింపులకు గురిచేశారని దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ దారుణానికి పాల్పడినట్లు గా అతను పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications