Coronavirus : కొత్తగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు.. 5 కేరళలో, ఒకటి తమిళనాడులో..
కేరళలో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఆ ఐదుగురిలో ముగ్గురు ఇటీవలే ఇటలీ వెళ్లి వచ్చారని.. వారి నుంచి మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన ఆ ముగ్గురు విమానాశ్రయంలో తమ ట్రావెల్ హిస్టరీ తెలియజేయలేదని శైలజ అన్నారు. దీంతో వారికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించలేదన్నారు. ఇటలీ నుంచి కేరళ వచ్చిన తర్వాత బంధువుల ఇళ్లకు కూడా వెళ్లారని.. దాంతో కరోనా అనుమానంతో వారు కూడా ఆసుపత్రికి వచ్చారని అన్నారు. ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.
తమిళనాడులోనూ పాజిటివ్ కేసు..
అటు తమిళనాడులోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసు బయటపడింది. తాజాగా బయటపడ్డ ఆరు కొత్త కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది. ఇక ఢిల్లీలో ఇప్పటివరకు 21 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఢిల్లీలో వర్షపాతం నమోదైంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో కరోనా మరింత వ్యాప్తి చెందుతుందన్న వదంతులు పుట్టుకొచ్చాయి. అయితే వాతావరణ ఉష్ణోగ్రతల ప్రభావం కరోనా వ్యాప్తిపై ఉండదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.
అరుణాచల్ ప్రదేశ్లో వదంతులు..
అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేస్తున్న ఓ వ్యక్తిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. జిల్లా మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్టులో.. పాసిఘాట్లో ఇద్దరికి కరోనా సోకిందని.. వారిని అసోంలోని దిబ్రుఘర్కి తరలించారని పేర్కొన్నాడు. స్థానికుల్లో భయాందోళన నెలకొనేలా ఉన్న ఈ పోస్టును తీవ్రంగా పరిగణించిన మెడికల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది.
అప్రమత్తంగా ఢిల్లీ సీఎం
కరోనా వైరస్ వ్యాప్తిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకు 25 ఆసుపత్రుల్లో 168 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి తాము అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నామని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కాగా,కరోనా వైరస్ పుట్టుకొచ్చిన చైనాలోని హుబేయ్ ప్రావిన్స్లో ఇప్పటివరకు దాదాపు 1లక్ష మంది వైరస్ బారినపడ్డారు. ఇందులో 3500 మంది మృతి చెందారు.